మోదకొండమ్మ శతకంపట్టు ఆహుతి
ABN , First Publish Date - 2023-03-05T01:07:17+05:30 IST
మతిస్థిమితం లేని వ్యక్తి అర్ధరాత్రి మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి శతకంపట్టు (పాదాలు ఉండే పూరిల్లు), ఒక పశువుల పాకకు నిప్పంటించాడు. స్థానికులు వెంటనే గమనించి మంటలు ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటనలకు కారకుడైన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ దామోదరనాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించి స్థానికులు, ఎస్ఐ వెల్లడించి వివరాలు...
మతిస్థిమితం లేని వ్యక్తి నిప్పంటించడంతో కాలిపోయిన పూరిల్లు
అంతకుముందు పశువుల పాక దహనం
కేసు నమోదు.. నిందితుడి అరెస్టు
మాడుగుల/ రూరల్, మార్చి 4: మతిస్థిమితం లేని వ్యక్తి అర్ధరాత్రి మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి శతకంపట్టు (పాదాలు ఉండే పూరిల్లు), ఒక పశువుల పాకకు నిప్పంటించాడు. స్థానికులు వెంటనే గమనించి మంటలు ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటనలకు కారకుడైన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ దామోదరనాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించి స్థానికులు, ఎస్ఐ వెల్లడించి వివరాలు...
మాడుగుల గ్రామానికి చెందిన రొబ్బా అప్పారావు(40)కు కొంతకాలం నుంచి మతిస్థిమితం వుండడంలేదు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో హైస్కూల్ కాలనీకి సమీపంలో అలమండ నాయుడు అనే రైతుకు చెందిన పశువుల పాకకు నిప్పంటించాడు. ఈ సమయంలో అటుగా వెళుతున్న కొంతమంది వ్యక్తులు చూసి బిగ్గరగా కేకలు వేశారు. దీంతో అప్పారావు అక్కడి నుంచి పారిపోగా, చుట్టు పక్కల వుంటున్నవారు వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా సమాచారం అందుకున్న అగ్నిమాపక అఽధికారి రాజేశ్వరరావు, సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. వేసవి కావడంతో పశువులను ఆరు బయట కట్టేశానని, లేకపోతే మూడు గేదెలు అగ్నికి ఆహుతి అయ్యేవని బాధిత రైతు అలమండ నాయుడు అన్నారు. సుమారు రూ.50 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లి వుంటుందని అగ్నిమాపక అధికారి తెలిపారు.
ఇది జరిగిన కొద్దిసేపటికి అక్కడకు సుమారు అర కిలోమీటరు దూరంలో వున్న మోదకొండమ్మ అమ్మవారి శతకం పట్టు (అమ్మవారి పాదాలు పూజించేందుకు నిర్మించిన పూరిల్లు) నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్న చేసిన ఫలితం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికి పూర్తిగా కాలిపోయింది. అమ్మవారికి ఏటా మే నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో జాతర నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. జాతరకు నెలరోజుల ముందు అమ్మవారి ఆలయంలో ఉన్న ఘటాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి శతకం పట్టు వద్ద ఉంచి నిత్యం పూజలు చేస్తారు. అమ్మవారి శతకం పట్టు కాలిపోవడంతో భక్తులు విచారం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, శ్రీనాథు శ్రీనివాసరావు, దంగేటి సూర్యారావు, తదితరులు శనివారం ఉదయం అమ్మవారి శతకం పట్టుని పరిశీలించారు. త్వరలో పునర్నిర్మాణం చేపడతామని తెలిపారు. అలమండ నాయుడుఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ దామోదరనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మతిస్థిమితం లేని రొబ్బా అప్పారావును అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. తరువాత కేసు నమోదు చేసి, చోడవరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.