యువగళం ముగింపు సభను విజయవంతం చేయండి
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:55 PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరగనుండగా టీడీపీ, జనసేన శ్రేణులు విజయవంతం చేయాలని టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లా ఇన్చార్జి బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు.
టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లా ఇన్చార్జి బుద్ధా వెంకన్న
తుమ్మపాల, డిసెంబరు 18: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరగనుండగా టీడీపీ, జనసేన శ్రేణులు విజయవంతం చేయాలని టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లా ఇన్చార్జి బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ముగింపు సభకు అనకాపల్లి నియోజకవర్గం నుంచి పది వేల మంది వచ్చేలా నాయకులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. యువగళం పాదయాత్రతో వైసీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిందన్నారు. రాష్ట్రంలో పలు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు అందాయని, అన్నింటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నారా లోకేశ్ హామీ ఇవ్వడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. వైసీపీ పాలనలో అన్యాయాలకు పాల్పడిన నాయకుల పేర్లు ఎర్ర పుస్తకంలో లిఖించామని, టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే వారంతా తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జైళ్లకు వెళ్లడం ఖాయమన్నారు. భవిష్యత్తులో వైసీపీ నాయకులను ప్రజలు రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వరని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద, నాయకులు కాయల మురళి, మాదంశెట్టి నీలబాబు, మళ్ల సురేంద్ర, కొణతాల శ్రీనివాసరావు, ఉగ్గిన రమణమూర్తి, గొంతిన శ్రీనివాసరావు, బీఎస్ఎంకే జోగినాయుడు, పోలారపు త్రినాథ్, బొద్దపు ప్రసాద్, సబ్బవరపు గణేశ్ తదితరులు పాల్గొన్నారు.