అనకాపల్లి రైల్వే స్టేషన్కు మహర్దశ
ABN , First Publish Date - 2023-08-01T00:50:03+05:30 IST
స్థానిక రైల్వేస్టేషన్ అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించే స్టేషన్లలో అనకాపల్లికి కూడా చోటు లభించింది.
అనకాపల్లి టౌన్, జూలై 31: స్థానిక రైల్వేస్టేషన్ అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించే స్టేషన్లలో అనకాపల్లికి కూడా చోటు లభించింది. దేశవ్యాప్తంగా సుమారు ఏడున్నర వేల రైల్వేస్టేషన్లు ఉండగా వీటిల్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,600 స్టేషన్లను అప్గ్రేడ్ చేస్తూ పలురకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ విజయవాడ డివిజన్ పరిధిలో 11 రైల్వేస్టేషన్లను ఈ పథకం కింద ఎంపిక చేయగా వీటిలో అనకాపల్లి స్టేషన్కు చోటు దక్కింది. సుమారు రూ.20 కోట్లతో స్టేషన్ను అభివృద్ధి చేస్తారని రైల్వే వర్గాల సమాచారం. ఈ పనులకు ఆగస్టు ఆరో తేదీన భూమిపూజ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.
ఏ పనులు చేస్తారంటే..
ప్రస్తుతం అనకాపల్లి రైల్వేస్టేషన్ నుంచి జిల్లాలోని అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులు కూడా ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రోజుకు సగటున ఆరు వేల మంది ఇక్కడి నుంచి ప్రయాణిస్తుంటారు. అయితే ఏ గ్రేడ్ స్టేషన్గా వున్న అనకాపల్లిలో ఆ స్థాయిలో ప్రయాణికులకు సదుపాయలు లేవు. గతంలో చేపట్టిన పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అనకాపల్లి ఎంపిక కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. ఈ పథకం కింద చేపట్టే పనులు పూర్తయితే స్టేషన్ రూపురేఖలే మారిపోతాయని, ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఒకటో నంబరు ప్లాట్ఫారాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం రెండు కాలినడక వంతెనలు, రెండు ఎస్కలేటర్లు ఉన్నాయి. గూడ్స్షెడ్డు వైపు ఉన్న కాలినడక వంతెనకు ఆనుకుని లిఫ్ట్ ఏర్పాటు చేస్తారు. ఒకటో ప్లాట్ ఫారం మధ్యలో ఒక కాలినడక వంతెన, రెండు ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు, మరో లిఫ్ట్ కూడా అందుబాటులోకి వస్తుంది. రెండు, మూడు ప్లాట్ఫారాల మధ్య ఉన్న అధికారుల కార్యాలయాలను రైల్వేస్టేషన్ ప్రధాన మార్గంలోని బుకింగ్ కార్యాలయానికి సమీపంలో నిర్మించే భవనంలోకి తరలిస్తారు. ఒకటో నంబరు ప్లాట్ ఫారాన్ని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కాలినడక వంతెన వరకు అభివృద్ధి చేస్తారు. రెండు, మూడు ప్లాట్ఫారాల మధ్య ప్రయాణికుల వెయిటింగ్ హాల్/ రూమ్స్, క్యాంటీన్, రిఫ్రెష్మెంట్ స్టాల్స్ ఉంటాయి. పనులు మొదలుపెట్టిన తరువాత ఏడాది కాలంలో పూర్తవుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.