నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2023-04-03T01:12:04+05:30 IST

ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు
అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 2: ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కొత్త అమావాస్య జాతర జరుగుతున్న నేపథ్యంలో రెండు ఆదివారాల కంటే ఈ ఆదివారం ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం పెట్టిన తరువాత భక్తులకు దర్శనం కల్పించారు. గత రెండు ఆదివారాలతో పోల్చితే ఈ వారం రూ.100 రూ.200 క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనం భక్తుల క్యూ రజక కాలనీ వరకు ఉంది. భక్తుల తాకిడి అధికమవ్వడంతో ఆలయానికి వచ్చే మార్గాలు భక్తులతో సందడిగా మారింది. అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి పలుశాఖల అధికారులు కూడా వచ్చి కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలు దాటినా అమ్మవారి ఆలయంలో భక్తుల సందడి తగ్గలేదు. ఆలయ కాటేజిలు, పరిసర ప్రాంతాల్లోని తోటల్లో భక్తులు వంటలను చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుని కుటుంబసభ్యులంతా సహపంక్తి భోజనాలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో బండారు ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ దాడి మోహనరావు, భక్తులకు ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్‌ సీఐ టి. శ్రీనుల ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2023-04-03T01:12:04+05:30 IST