దివ్యాంగులను ఆదుకుందాం
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:07 AM
ప్రభుత్వం దివ్యాంగులకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్ పెంచాలని, సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు కోరారు.
పెదవాల్తేరు, డిసెంబరు 23 : ప్రభుత్వం దివ్యాంగులకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్ పెంచాలని, సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు కోరారు. శనివారం ఆయన లాసన్స్ బే కాలనీలో ఉన్న శాంతి ఆశ్రమం డెఫ్ అండ్ డెం స్కూల్లో దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల క్రీడల కోసం నిర్థేశించిన పది ఎకరాల్లో వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దేశమంతా 14700 పైగా శిబిరాలు నిర్వహించిందని, 30 లక్షల మందికి ఉపకరణాలు అందజేయాలన్న లక్ష్యంతో మోదీ ఉన్నారన్నారు. జిల్లాలో సుమారు 50 వేల మంది దివ్యాంగులు ఉన్నట్టు సమాచారం ఉందని, వారందరికీ కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ వయో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధికారి మాధవి, జీవీఎంసీ ఏపీడీ దుర్గాప్రసాద్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం అమలు చేసిన పథకాల గురించి వివరించారు.