నర్సీపట్నంలో భారీగా పెరిగిన భూముల ధరలు
ABN , First Publish Date - 2023-06-03T00:36:43+05:30 IST
పట్టణంలో భూముల మార్కెట్ విలువ 13 శాతం నుంచి గరిష్టంగా 80 శాతానికి పెంచేశారు. సదరు మార్కెట్ ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. నర్సీపట్నం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని 96 గ్రామాలకు గాను ప్రత్యేక రివిజన్ పేరుతో ఇరవై గ్రామాలలో భారీగా భూముల మార్కెట్ ధరలు పెంచారు.
13 శాతం నుంచి గరిష్టంగా 80 శాతం పెంపు
పట్టణంలో గజం రూ.3,600 నుంచి రూ.7 వేలు
చెట్టుపల్లిలో ఎకరా రూ.7.5 లక్షలు నుంచి రూ.15 లక్షలు
నర్సీపట్నం, జూన్ 2 : పట్టణంలో భూముల మార్కెట్ విలువ 13 శాతం నుంచి గరిష్టంగా 80 శాతానికి పెంచేశారు. సదరు మార్కెట్ ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. నర్సీపట్నం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని 96 గ్రామాలకు గాను ప్రత్యేక రివిజన్ పేరుతో ఇరవై గ్రామాలలో భారీగా భూముల మార్కెట్ ధరలు పెంచారు. మునిసిపాలిటీలోని నర్సీపట్నంలో స్థలం గజం రూ.3,600 నుంచి రూ.7000లకు పెంచారు. బయపురెడ్డిపాలెంలో గజం రూ.2,700 నుంచి రూ.4000, పెదబొడ్డేపల్లిలో రూ.2000 నుంచి రూ.4000లకు పెరిగింది. మెయిన్ రోడ్డు దగ్గరగా ఉన్న స్థలాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఇతర అంశాల ఆధారంగా మార్కెట్ ధరలు మారుతుంటాయని సబ్ రిజిస్ట్రార్ హర్షవర్థన్రెడ్డి తెలిపారు. నర్సీపట్నం మునిసిపాలిటీని ఆనుకొని ఉన్న గ్రామాలలో కూడా భూముల మార్కెట్ విలువ పెంచారు. చెట్టుపల్లిలో ఎకరా రూ.7.5 లక్షలు నుంచి రూ.15 లక్షలకు రెట్టింపు చేశారు. మునిసిపాలిటీలో భవనాల రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్ విలువ చదరపు అడుగు రూ.1200 ఉండగా, తాజాగా రూ.1400 చేశారు. ఉదాహరణకు పెరిగిన మార్కెట్ ధర ప్రకారం నర్సీపట్నం టౌన్లో రెండు సెంట్ల స్థలంలోని డాబా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించు కోవాలంటే సుమారు రూ.1.5 లక్షలు ఖర్చవుతుంది.