బురదలో జగనన్న కాలనీ ఇళ్లు
ABN , First Publish Date - 2023-12-11T00:39:42+05:30 IST
ఉపమాక జగనన్న కాలనీ బురదలో కొట్టుమిట్లాడుతున్నది. ఈ కాలనీలో అయ్యన్నపాలెం, ఉపమాక, నక్కపల్లి, బోదిగల్లం, జానకయ్యపేట గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వీరిలో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు.
ఆరు రోజులుగా ఇళ్ల మధ్య వర్షపునీరు
కన్నెత్తి చూడని అధికారులు
శానిటేషన్ పనులు శూన్యం
నక్కపల్లి, డిసెంబరు 10: ఉపమాక జగనన్న కాలనీ బురదలో కొట్టుమిట్లాడుతున్నది. ఈ కాలనీలో అయ్యన్నపాలెం, ఉపమాక, నక్కపల్లి, బోదిగల్లం, జానకయ్యపేట గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వీరిలో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఈనెల 4వ తేదీన భారీ వర్షం కురిసింది. ఈ కాలనీలో డ్రైన్లు, రహదారులు లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్ల మధ్యే నిలిచిపోయింది. ఉపమాక జగన్న కాలనీలో ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తున్నది. రోజుల తరబడి నీరు వుండిపోవడంతో సాయంత్రమైతే దుర్వాసన వస్తోందని, దోమలు స్వైర విహారం చేస్తున్నాయని పలువురు వాపోతున్నారు. పాముల బెడద ఎక్కువగా వుందని ఆందోళన చెందతున్నారు. చాలా మందికి సీజనల్ వ్యాధులు సోకుతున్నాయని చెబుతున్నారు. తుఫాన్ తర్వాత ఒక్కరోజూ కూడా పంచాయతీ ద్వారా పారిశుధ్య పనులు చేయకపోవడంతో ఇక్కడ పరిస్థితి భయానకంగా కనబడుతోంది.. దీనిపై సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేస్తామని కాలనీ వాసులు చెప్పారు.