ఓటింగ్ శాతం పెంచండి
ABN , Publish Date - Dec 23 , 2023 | 01:06 AM
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.
జిల్లా కలెక్టర్కు ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు సూచన
విశాఖపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. శుక్రవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ-2024, ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో 2019 ఎన్నికల్లో 67.2 శాతం ఓటింగ్ జరిగిందని పేర్కొంటూ...ఈసారి మరింతమంది వచ్చి ఓటు వేసేలా చైతన్యపరచాలన్నారు. దీనిపై కలెక్టర్ మల్లికార్జున వివరణ ఇస్తూ, వచ్చే ఎన్నికల్లో 75 శాతానికి పైబడి ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో శిబిరాలు ఏర్పాటుచేసి ఓటర్లను చైతన్యపరుస్తామన్నారు. వార్డు, గ్రామ సచివాలయాల కార్యదర్శులను కూడా ఓటర్ల వద్దకు పంపుతామన్నారు. ఇంకా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వ్యక్తుల ద్వారా ప్రచారం చేయిస్తామని వివరించారు. జిల్లాలో చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు తొలగించినట్టు చెప్పారు. ఓట్ల తొలగింపునకు తొలుత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నోటీసులు అందించామన్నారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమిషనర్ ఎ.రవిశంకర్ అయ్యనార్ హాజరయ్యారు.