ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2023-11-20T01:39:45+05:30 IST
విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఆదివారం అర్ధ ్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 60కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాత్రి 11.30 గంటలు దాటిన తరువాత జీరో నంబరు జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి. సాధారణంగా మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ హార్బర్లోనే లంగరు వేసి ఉంచుతారు.

సుమారు 60కిపైగా బోట్ల నుంచి మంటలు
భారీగా ఎగసిపడుతున్న అగ్ని కీలలు
అదుపుచేసేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక శకటాలు
సుమారు రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం
విశాఖపట్నం/ మహారాణిపేట, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఆదివారం అర్ధ ్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 60కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాత్రి 11.30 గంటలు దాటిన తరువాత జీరో నంబరు జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి. సాధారణంగా మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ హార్బర్లోనే లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల కిందట సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికిచేరాయి. వాటిలో రూ.లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదని ఏపీ మర పడవల సంఘం అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులే నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు రేగడంతో మత్స్యకారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అందుబాటులో ఉన్న మూడు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించాయి. మరో మూడు శకటాలను రప్పించేందుకు ఆర్డీవో హుస్సేన్సాహెబ్ చర్యలు తీసుకున్నారు. అయితే సముద్ర గాలులకు మంటలు మరింతగా రేగి పక్కనున్న బోట్లకు విస్తరించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మత్సకారుల్లో కొంతమంది ధైర్యంగా వారి బోట్లను సముద్రంలోకి తీసుకుపోవడంతో కొంత నష్టం తగ్గింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అందిన సమాచారం మేరకు ప్రమాదంలో సుమారు రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రాత్రి పూట బోట్లలో మత్స్యకారులు ఎవరూ ఉండరని, అయితే ప్రమాద సమయంలో వాటిలో ఎవరైనా ఉండిపోయారా అనేది తెలియరావడం లేదు. కాగా కళ్లముందే తమ జీవనాధారమైన బోట్లన్నీ మంటల్లో కాలిపోతుండడంతో మత్స్యకారులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.