నిలువుకాళ్లపై నరకం
ABN , First Publish Date - 2023-08-02T03:22:46+05:30 IST
ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విశాఖ కైలాసపురానికి సీఎం జగన్ రాక సందర్భంగా మహిళలకు నరకం చూపించారు.
విశాఖలో జగన్కు స్వాగతం పేరిట మహిళలకు నాలుగు గంటల శిక్ష
పథకాల పేరిట బెదరగొట్టి తరలింపు
ఉదయం 8గంటలకే రోడ్డుపైకి...
మధ్యాహ్నం దాకా ఫుట్పాత్లపైనే..
పొద్దున్నే రావడంతో ఆకలికి నకనక
కనీసం మహిళల మరుగుదొడ్లూ లేవు
రిసోర్స్ పర్సన్లు, వలంటీర్లపై తీవ్రస్థాయిలో మహిళల మండిపాటు
సీఎం రాకముందే కొందరు వెనక్కి
విశాఖపట్నం/అక్కయ్యపాలెం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విశాఖ కైలాసపురానికి సీఎం జగన్ రాక సందర్భంగా మహిళలకు నరకం చూపించారు. జగన్కు స్వాగతాల పేరి ట ఏకంగా 4 గంటలకుపైగా డ్వాక్రా మహిళల ను జాతీయ రహదారిపై నిలబెట్టేశారు. ఈ క్రమంలో కాస్త పెద్ద వయసు మహిళలు సోష వచ్చి ఫుట్పాత్పై కూలబడ్డారు. ‘పథకాలు పో తాయి’ అని డ్వాక్రా లీడర్లు, రిసోర్స్ పర్సన్లు చేసిన హెచ్చరికలతో హైవేపైకి వచ్చిన వీరికి కనీస వసతులూ లేకుండాచేసి మరింత శిక్షించారు. మహిళల కోసం ప్రత్యేకించి ఎలాంటి మొబైల్ టాయ్లెట్లు ఏర్పాటు చేయలేదు. మగవాళ్లయితే ఏదో ఒకదారి ఉంటుందని, మహిళలు ఎటు వెళ్లాలని రైల్వేన్యూకాలనీకి చెందిన ఉదయశ్రీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో కూడిన వాతావరణంతో గొంతెండిన మహిళలు తాగునీటి కోసం ఆర్పీలు, వలంటీర్లను నిలదీశా రు. అక్కడక్కడా జీవీఎంసీ ఏర్పాటుచేసిన వా టర్ క్యాన్ల వద్దకు వెళ్లి తాగాలని సూచించి వారు చేతులు దులుపుకున్నారు. మంచినీళ్లు కూడా ఇవ్వలేని ఆర్పీలు తమను ఎందుకు తీసుకువచ్చారంటూ కైలాసపురానికి చెందిన కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకరిద్దరు ఆర్పీలు/వలంటీర్లు ఈ సమస్యను వైసీపీ నేతల దృష్టికి తీసుకువెళ్లగా ఇప్పటికిప్పు డు ఏమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. ఉద యం నుంచి ఏమీ తినలేదని కొంతమంది మహిళలు అడిగితే.. చిన్న బిస్కట్ ప్యాకెట్లు ఇచ్చి సరిపెట్టుకోమన్నారు. షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ ఉదయం 11.15 గంటలకల్లా కైలాసపురం చేరుకోవాలి. అయితే ఆయన 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. మహిళలను మా త్రం ఉదయం ఎనిమిది గంటలకే జాతీయ రహదారిపైకి తరలించారు. 50 ఏళ్లు దాటిన మహిళలు, చిన్నపిల్లలతో వచ్చిన మహిళల బాధలు వర్ణనాతీతం.
‘హాజరయినట్టు ఫొటోలు పంపండి’
డ్వాక్రా మహిళల తరలింపులో ఆర్పీలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కీలకంగా వ్యవహరించారు. సభ్యులు హాజరైనట్టు ఫొటో తీసి తమకు పంపించాలని సంఘాల అధ్యక్షురాళ్లను రీసోర్స్ పర్సన్లు ఆదేశించారు. స్వాగతం పలికేందుకు రాకపోతే పథకాలు ఆపేస్తామని వలంటీర్ బెదిరిస్తున్నారని తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఆరోపించారు. సీఎంకు స్వాగతం పలికేందుకు తొమ్మిది గంటలకల్లా రావాలని చెప్పడంతో వీధిలో మహిళల ను బతిమాలి తీసుకువచ్చానని దొండపర్తికి చెందిన వలంటీర్ ఒకరు చెప్పారు. కాగా, సీఎం కాన్వాయ్ వస్తున్న సమయంలో కొందరు మహిళలు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించగా, ఆయన కార్యదర్శి రేవు ముత్యాలరాజు వాహనం ఆపి వాటిని స్వీకరించారు. ఇదిలా వుంటే, కొంతమంది మహిళలు సీఎం రాకపోవడంతో గుంపులుగా తిరుగుముఖం పట్టారు. వీ రిని ఆపేందుకు పోలీసులు, ఆర్పీలు, వైసీపీ నేతలు యత్నించారు. అయితే, పథకాలిచ్చినం త మాత్రాన అందరు రావాలని చెప్పడమేమిట ని మహిళలు ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చే సొమ్ము సీఎం లేదా వలంటీర్ ఇంటి నుంచి తీసుకువస్తున్నారా? అని మండిపడ్డారు. ఆంధ్ర వర్సిటీలో సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం బీఈడీ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా.. విద్యార్థులను పోలీసులు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేశాకే ఏయూలోకి పంపించారు. పలువురు విద్యార్థులు ముఖానికి నల్లని మాస్క్ పెట్టుకుని రాగా, పోలీసులు తీయించేశారు. నల్ల బ్యాగులు కలిగిన, చొక్కాలు ధరించిన, టోపీలు పెట్టుకున్న వారిని కూడా అనుమతించలేదు.
విశాఖ రూపురేఖలు మారతాయి
ఇన్ ఆర్బిట్ మాల్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్
విశాఖపట్నం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఇన్ ఆర్బిట్ మాల్’ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారిపోతాయని, ఇది ఆణిముత్యం లాంటి ప్రాజెక్టు అని సీఎం జగ న్ అన్నారు. విశాఖలోని కైలాసపురంలో 17 ఎకరాల్లో రహేజా నిర్మాణాలకు మం గళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 12 నుంచి 13 ఎకరాల్లో మాల్ నిర్మించనున్నారని, ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదిగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్లో మాల్ కేవలం 7 ఎకరాల్లోనే ఉందని, అంతకు రెట్టింపు విస్తీర్ణంలో ఇక్కడ నిర్మిస్తారన్నారు.
తడబడిన జగన్..
గణాంకాల విషయంలో సీఎం జగన్ తడబడ్డారు. కైలాసపురంలో విశాఖప ట్నం పోర్టు నుంచి లీజుకు తీసుకున్న 17 ఎకరాల స్థలంలో రహేజా మాల్ నిర్మాణానికి ముందుకువచ్చింది. దానికే సీఎం జగన్ మంగళవారం శంకుస్థాపన చేశా రు. ఆయన మాట్లాడుతూ, 12 నుంచి 13 ఎకరాల్లో అతిపెద్ద మాల్ నిర్మిస్తారన్నారు. రెండో దశలో మిగిలిన 4 ఎకరాల్లో 2.5 లక్షల ఎకరాల ఐటీ స్పేస్ నిర్మిస్తారన్నా రు. వాస్తవానికి 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ స్పేస్ అని చెప్పాలి.