పేలుతున్న నాటుతుపాకులు
ABN , First Publish Date - 2023-08-14T01:12:08+05:30 IST
మన్యంలో ఇటీవల కాలంలో నాటు తుపాకులు తరచూ పేలుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి నాటు తుపాకుల వినియోగం చట్టరీత్యా నేరమైనప్పటికీ, ఏజెన్సీలో గిరిజనులు సంప్రదాయ వేట సాగిస్తారనే భావనతో పోలీసులు వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం లేదు. దీంతో ఇదే అదునుగా ఒడిశాను ఆనుకుని ఉన్న ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో నాటు తుపాకులను గిరిజనులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని తెలుస్తున్నది.
- మారుమూల ప్రాంతాల్లో విచ్చలవిడిగా వినియోగం
- ఇటీవల పాడేరు మండలంలో యువకుడి మృతి
- తాజాగా పెదబయలు మండలం వనుకొత్తూరులో మరో యువకుడు బలి
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
మన్యంలో ఇటీవల కాలంలో నాటు తుపాకులు తరచూ పేలుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి నాటు తుపాకుల వినియోగం చట్టరీత్యా నేరమైనప్పటికీ, ఏజెన్సీలో గిరిజనులు సంప్రదాయ వేట సాగిస్తారనే భావనతో పోలీసులు వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం లేదు. దీంతో ఇదే అదునుగా ఒడిశాను ఆనుకుని ఉన్న ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో నాటు తుపాకులను గిరిజనులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని తెలుస్తున్నది.
ప్రధానంగా పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు నాటుతుపాకులతో సమీపం అడవుల్లో జంతువుల వేట సాగిస్తుంటారు. ఈ క్రమంలో పొరపాట్లు జరిగినా, లేదా తమ మధ్య విబేధాలు ఏర్పడినప్పుడు నాటుతుపాకులతో కాల్చుకున్న సంఘటనలున్నాయి. జూలై నెలలో పాడేరు మండలంలోని కొత్తూరు గ్రామంలో నాటుతుపాకీతో కాల్చుకుని గిరిజన యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకోవడాన్ని జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా సీరియస్గా తీసుకున్నారు. దీంతో ఏజెన్సీలో నాటుతుపాకులపై ప్రత్యేక నిఘా పెట్టి, వాటిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. కానీ ఎక్కడా నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేనప్పటికీ, తాజాగా నాటుతుపాకీ తూటకు ఓ యువకుడు బలికావడం విశేషం.
తాజాగా రెండు ఘటనలు
పాడేరు మండలంలో మారుమూల దేవాపురం పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన కొండపల్లి కొండలరావు(22)కు, వరుసకు వదిన అయిన లక్ష్మితో ఈ ఏడాది జూలై 7న స్వల్ప తగాదా జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కొండలరావు తన ఇంట్లో ఉన్న నాటుతుపాకీతో గొంతులో కాల్చుకుని మృతి చెందాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. అలాగే జి.మాడుగుల, పెదబయలు మండలాల సరిహద్దు అడవుల్లో వేటకు వెళ్లిన గిరిజనుల చేతిలో నాటుతుపాకీ పేలిన ఘటనలో శుక్రవారం తెల్లవారుజామున ఓ గిరిజన యువకుడు మృతి చెందాడు.