ఎర్రవరంలో ఎండుతున్న గొంతులు
ABN , First Publish Date - 2023-02-21T00:26:53+05:30 IST
మండలంలోని ఎర్రవరంగ్రామాన్ని నెలరోజులుగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. దీంతో అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
20జీఎల్డీ2 : అర కిలోమీరు దూరం నుంచి నీటిని మోసుకు వస్తున్న మహిళలు
గ్రామంలో అడుగంటిన భూగర్భ జలాలు
అర కి.మీ. నుంచి తెస్తున్న మహిళలు
గొలుగొండ, ఫిబ్రవరి 20 : మండలంలోని ఎర్రవరంగ్రామాన్ని నెలరోజులుగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. దీంతో అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామంలో సుమారు ఐదు వందల మందివరకు జనాభా నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో పైపులైన్ ఏర్పాటు చేశారు. అయితే భూగర్భ జలాలు అడుగంటడంతో నెల రోజులుగా తాగునీరు ఉద యంపూట ఇరవై నిమిషాల నుంచి ముప్ఫై నిమిషాలు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో ఈ నీరు ఎటుకూ చాలడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో గత్యంతరం లేక అర కిలోమీటరు దూరంలో ఉన్న బోరునుంచి నీటిని తెచ్చుకుంటున్నట్టు గ్రామానికి చెం దిన మహిళలు వాపోతున్నారు. ఇదిలావుంటే, గ్రామంలో రెండు చేతిబోర్లు ఉన్నాయి. వాటి నుంచి కూడా నీరు సరిగా అందని దుస్థితి నెలకొంది. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోతోందని పలువురు చెపుతున్నారు.
ఈ సమస్యను ఆర్డబ్ల్యూఎస్ జేఈ సుధీషణ వద్ద ప్రస్తావించగా, ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకు వెళ్లినట్టు చెప్పారు. నిధులు విడుదలైన వెంటనే కొత్తగా బోరు తవ్వించి సమస్యను పరిష్కరిస్తామని వివరించారు.