మా వేదన పట్టదా!
ABN , First Publish Date - 2023-05-31T22:47:27+05:30 IST
సప్పర్ల రెయిన్ గేజ్ నుంచి గూడెంకొత్తవీధి వరకు గల అంతర్ రాష్ట్ర రహదారి ఎక్కడికక్కడ గోతులమయంగా ఉండడంతో వాహనచోదకులు ఇబ్బం దులు పడుతున్నారు. వాహనాలు మరమ్మతులకు గురికావడంతో పాటు ఒళ్లు హూనమవుతోందని ఆవేదన చెందుతున్నారు.
అధ్వానంగా సప్పర్ల రెయిన్ గేజ్- జీకే వీధి రహదారి
రాళ్లు తేలి, గోతులమయంగా ఉండడంతో రాకపోకలకు అవస్థలు
మరమ్మతులకు గురవుతున్న వాహనాలు
‘స్పందన’లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
నరకం చూస్తున్నామని వాహనచోదకుల ఆవేదన
సీలేరు, మే 31: సప్పర్ల రెయిన్ గేజ్ నుంచి గూడెంకొత్తవీధి వరకు గల అంతర్ రాష్ట్ర రహదారి ఎక్కడికక్కడ గోతులమయంగా ఉండడంతో వాహనచోదకులు ఇబ్బం దులు పడుతున్నారు. వాహనాలు మరమ్మతులకు గురికావడంతో పాటు ఒళ్లు హూనమవుతోందని ఆవేదన చెందుతున్నారు.
జీకేవీధి మండలం సప్పర్ల రెయిన్ గేజ్ నుంచి గూడెంకొత్తవీధి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి గోతులమయంగా ఉంది. ఈ రహదారిలో ప్రయాణమంటేనే వాహనచోదకులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ రహదారి గుండా ప్రయాణిస్తే వాహ నాలు మరమ్మతులకు గురై ఎక్కడ ఆగిపోతాయోనని భీతిల్లుతున్నారు. ఇటీవల పలు ఆర్టీసీ బస్సులు ఈ రహదారిలో వెళుతూ మరమ్మతులకు గురికావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సప్పర్ల రెయిన్ గేజ్ నుంచి జీకేవీధి వరకు గల ఈ రహదారి పనులను చేపట్టిన కాంట్రాక్టరుకు గతంలో చేసిన పనులకు సంబంధించి రూ.7 కోట్లు బిల్లులు రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో సప్పర్ల రెయిన్ గేజ్ నుంచి జీకేవీధి వరకు పనులను చేయలేమని ఆర్ అండ్ బీ అధికారులకు ఆ కాంట్రాక్టరు లేఖ రాశారు. ఈ క్రమంలో పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఈ రహదారి దెబ్బతిని మరీ అధ్వానంగా తయారైంది. ఈ రహదారి దుస్థితిపై ఇటీవల సీలేరు, ధారకొండకు చెందిన కొందరు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేకుండాపోయింది. సప్పర్ల రెయిన్ గేజ్ నుంచి గూడెంకొత్తవీధి వరకు ప్రయాణించాలంటే నరకం చూస్తున్నామని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు.