పచ్చదనంపై వేటు!
ABN , First Publish Date - 2023-01-29T00:55:36+05:30 IST
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే చాలు...ఆ మార్గంలో డివైడర్లపై మొక్కలపై జీవీఎంసీ అధికారులు రకరకాల ప్రయోగాలు చేస్తూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు.
సీఎం వస్తున్నారని...ఆ మార్గంలో చెట్ల కొమ్మలు కొట్టేసి రంగులేశారు
జీవీఎంసీ అధికారుల అత్యుత్సాహం
దుకాణాలన్నీ మూసివేత
విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే చాలు...ఆ మార్గంలో డివైడర్లపై మొక్కలపై జీవీఎంసీ అధికారులు రకరకాల ప్రయోగాలు చేస్తూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. సీఎం శనివారం నగర పరిధిలోని చినముషిడివాడలో గల శారదా పీఠానికి వస్తారని...ఆ మార్గంలో డివైడర్పై గల చెట్లను ఏకంగా నరికించేశారు. దుకాణాలు మూయించేశారు. ఈ పర్యటనలో భాగంగా ఒక ప్రజా ప్రతినిధి ఇంటికి వివాహ శుభాకాంక్షలు చెప్పేందుకు ముఖ్యమంత్రి రుషికొండ వెళతారని సమాచారం వచ్చింది. దాంతో ఆ మార్గంలో సాగర్నగర్ వద్ద డివైడర్పై వున్న చెట్ల కొమ్మలను పూర్తిగా తీసేసి, కాండాలకు రకరకాల రంగులతో డిజైన్లు వేశారు. ఎందుకిలా చేశారని అధికారులను ప్రశ్నిస్తే...విజయవాడలో అలాగే చేశారని, ఆకర్షణీయంగా ఉన్నాయని, అందుకే ఇక్కడ కూడా అలాగే చేశామని సెలవిచ్చారు. చక్కగా వున్న చెట్ల కొమ్మలను కత్తిరించేసి, రంగులు వేయడం ఏమిటని స్థానికులు విమర్శిస్తున్నారు. అలాగే ఈ మార్గంలో బీచ్ల వద్ద సాయంత్రమైతే దుకాణాలు పెట్టుకొని ఆహార పదార్థాలు అమ్ముకునే దుకాణాలన్నింటినీ రెండు రోజుల ముందే మూయించేశారు. ఆకస్మికంగా సీఎం శనివారం పర్యటన రద్దయినా సరే, జోడుగుళ్లపాలెం బీచ్లో ఎవరినీ దుకాణాలు తీయనీయకుండా అధికారులు అడ్డుకోవడం గమనార్హం. సీఎం పర్యటనల సందర్భంగా విశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఏ సీఎం వచ్చినా ఇలా చేయలేదని, ఇప్పుడే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని నగరవాసులు అంటున్నారు. ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందులు కలిగించకుండా, ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా చూడాలని అధికారులకు సూచిస్తున్నారు.