శిథిలావస్థలో పాఠశాల భవనం

ABN , First Publish Date - 2023-04-17T00:47:41+05:30 IST

పెచ్చులూడిపోతున్న పైకప్పు.. వర్షం వస్తే కారిపోతున్న భవనం.. ఆరుబయట నిలిచిపోతున్న నీరు.. ఏ క్షణాన ఏం ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల్లో భయం.. ఇదీ మండలంలోని పి.భీమవరం శివారు గొన్నవానిపాలెం ప్రాథమిక పాఠశాల దుస్థితి.

శిథిలావస్థలో పాఠశాల భవనం
శిథిల స్థితిలో ఉన్న గొన్నవానిపాలెం పాఠశాల భవనం

పెచ్చులూడిపోతున్న భవనం శ్లాబ్‌

ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

బుచ్చెయ్యపేట, ఏప్రిల్‌ 16: పెచ్చులూడిపోతున్న పైకప్పు.. వర్షం వస్తే కారిపోతున్న భవనం.. ఆరుబయట నిలిచిపోతున్న నీరు.. ఏ క్షణాన ఏం ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల్లో భయం.. ఇదీ మండలంలోని పి.భీమవరం శివారు గొన్నవానిపాలెం ప్రాథమిక పాఠశాల దుస్థితి. నాడు-నేడు పథకంలో విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నా గొన్నవానిపాలెం పాఠశాలను మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ పాఠశాలలో 24 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు గదుల ఈ పాఠశాల భవనం శ్లాబ్‌ పెచ్చులూడి పడిపోతున్నాయి. పిల్లలు గాయాలపాలవుతారేమోనని తల్లిదండ్రులు భీతిల్లుతున్నారు. వర్షం వస్తే భవనం కారిపోతుంది. భవనం గోడలు నానిపోతున్నాయి. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సదుపాయం లేకపోవడంతో నీరంతా స్కూల్‌ ఆవరణలో నిలిచిపోతుంది. దీనికి తోడు సగానికి పైగా ప్రహరీ గోడ దెబ్బతినడంతో పశువులు, కుక్కలు, పందులు పాఠశాల ఆవరణలో సంచరించడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ పాఠశాలకు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2023-04-17T00:47:41+05:30 IST