కొత్తూరులో దేవదాయ శాఖ స్థలం కబ్జా
ABN , First Publish Date - 2023-08-09T00:51:14+05:30 IST
అనకాపల్లి మండలం కొత్తూరు మేజర్ పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మరిడిమాంబ, శ్యామదాంబ అమ్మవార్ల దేవస్థానానికి చెందిన స్థలాన్ని కబ్జాకు గురైంది.
కొత్తూరు, ఆగస్టు 8: అనకాపల్లి మండలం కొత్తూరు మేజర్ పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మరిడిమాంబ, శ్యామదాంబ అమ్మవార్ల దేవస్థానానికి చెందిన స్థలాన్ని కబ్జాకు గురైంది. సర్వే నంబరు 670/17 నుంచి 22 వరకు 85 సెంట్లు దేవదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఖాళీ స్థలం ఉంది. దీనిని పూర్తిస్థాయిలో కబ్జా చేసేందుకు కబ్జాదారులు మట్టి, గ్రావెల్ను రాత్రి సమయంలో వేసి చదును చేశారు. ఇందులో భాగంగా రహదారిని ఆనుకొని ఉన్న ఐదు సెంట్ల స్థలాన్ని కప్పివేశారు. గతంలో రెవెన్యూ, దేవదాయ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది వచ్చి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో బోర్డు ఉన్నప్పటికీ కబ్జాదారులు గ్రావెల్, మట్టితో కప్పివేసి ఆక్రమించారు. ఇక్కడ ఇంత జరుగుతున్నా రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో సెంటు రూ.20లక్షలు పలుకుతోంది. దీంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించేస్తున్నారు.
కబ్జా వెనుక అధికార పార్టీ నేత హస్తం?
ఈ కబ్జా వెనుక కొత్తూరుకు చెందిన అధికార పార్టీ నాయకుడు హస్తం ఉందని స్థానికులు బహిరంగంగా చెబుతున్నారు. అధికార పార్టీ నాయకుడు కనుసన్ననలోనే ఈ కబ్జా జరుగుతున్నదని వారంటున్నారు. గ్రామపెద్దలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పంచాయతీలో కబ్జాకు గురైన స్థలాలను గుర్తించి, రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వివరణ
కొత్తూరు పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న దేవదాయ శాఖ స్థలం కబ్జాకు గురైన విషయమై ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ను వివరణ కోరగా.. ఆ స్థలానికి సంబంధించి పూర్తి సమాచారం నాకు ఇంతవరకు తెలియదు. స్థలం ఉన్న చోటుకి వెళ్లి పరిశీలిస్తానని బదులిచ్చారు. గతంలో ఉన్న ఇన్స్పెక్టర్కు ఈ స్థలం వివరాలను అడిగి తెలుసుకుంటానన్నారు.