సందర్శకుల సందడి
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:39 AM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు ఒకటే సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాల్లో పర్యాటకుల కోలాహలం కనిపించింది.
- మన్యంలోని పర్యాటక ప్రాంతాలు కిటకిట
(ఆంధ్రజ్యోతి/పాడేరు, న్యూస్ నెట్వర్క్)
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు ఒకటే సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాల్లో పర్యాటకుల కోలాహలం కనిపించింది.
లంబసింగిలో..
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు సందర్శకులకు లంబసింగికి క్యూకడుతున్నారు. ఆదివారం లంబసింగికి వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. దీంతో ఉదయం ఐదు గంటల నుంచే లంబసింగి జంక్షన్, చెరువులవేనం, తాజంగి జలాశయం వద్ద పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనంలో ఆవిష్కృతమయ్యే మంచు సోయగాలను వీక్షించేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. వ్యూ పాయింట్ వద్ద జాతర వాతావరణం తలపించింది. శ్వేత వర్ణంలో అడవులను తాకుతూ పయనించే మంచు మేఘాల సరసన ఫొటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. అలాగే యర్రవరం జలపాతం వద్దకు అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో లంబసింగి పరిసర పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో సాయంత్రం వరకు సందడిగా కనిపించాయి.
వంజంగి మేఘాల కొండ వద్ద..
పాడేరురూరల్: మండలంలోని వంజంగి మేఘాల కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. శనివారం రాత్రి పర్యాటకులు వంజంగి చేరుకున్నారు. అక్కడ టెంట్లు, రిసార్ట్స్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్, గిరిజన సంప్రదాయ నృత్యాలను ఆస్వాదించారు. ఉదయం 5 గంటలకు కొండపైకి చేరుకుని పాల సముద్రాన్ని తలపించే మేఘాలు, సూర్యోదయ సమయంలో భానుడి కిరణాలను తిలకించారు. అక్కడ నుంచి జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి వెళ్లి సరదాగా గడిపారు.