కొనసాగుతున్న చలి తీవ్రత
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:32 AM
మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. ఆదివారం పాడేరులో 14 డిగ్రీల కనిష్ఠ, 23 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి చలి గాలులు వీస్తుండడంతో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు దిగజారి చలి తీవ్రత పెరుగుతున్నది.
- పాడేరులో 14, చింతపల్లిలో 15.5 డిగ్రీలు
పాడేరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. ఆదివారం పాడేరులో 14 డిగ్రీల కనిష్ఠ, 23 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి చలి గాలులు వీస్తుండడంతో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు దిగజారి చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే ఒక మోస్తరుగా ఎండ కాస్తుండగా, మిగిలిన సమయంలో చలి వాతావరణం కొనసాగుతున్నది. దీంతో చలి మంటలు వేసుకుంటూ, ఉన్ని దుస్తులు ధరిస్తూ ఏజెన్సీ వాసులు చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.
చింతపల్లిలో...
చింతపల్లి: మన్యంలో చలి తీవ్రత పెరుగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులు జరుగుతున్నప్పటికి చలిలో ఎటువంటి మార్పులేదు. ఆదివారం చింతపల్లిలో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం.సురేశ్కుమార్ తెలిపారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా లంబసింగి, తాజంగి, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తున్నది. అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు మంచు వీడడంలేదు. కొన్ని ప్రాంతాల్లో 11 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచే చల్లగాలులు ప్రారంభమవుతున్నాయి.