సమ్మె విచ్ఛిన్నానికి అధికారుల కుట్ర
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:55 AM
మునిసిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అధికారులు కుట్ర పన్నుతున్నారని జీవీఎంసీ కార్మికుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు (సీఐటీయూ) ఆర్ఎస్ఎన్ మూర్తి అన్నారు.
భీమునిపట్నం, డిసెంబరు 29 : మునిసిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అధికారులు కుట్ర పన్నుతున్నారని జీవీఎంసీ కార్మికుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు (సీఐటీయూ) ఆర్ఎస్ఎన్ మూర్తి అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు రెల్లివీధిలో ఉన్న మస్తర్ పాయింట్ వద్ద పారిశుధ్య వాహనాలను వేరే వ్యక్తులు, సచివాలయం సిబ్బందితో తరలించడానికి అధికారులు చేసిన ప్రయత్నాలను ఆందోళన చేస్తున్న కార్మికులు అడ్డగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా.. సమ్మెకు సీఐటీయూ అండగా వుంటుందన్నారు. పాదయాత్రలో సీఎం ఇచ్చిన హామీ మేరకు పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాన్ని రూ. 26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయాలని, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికుల సంఘం నాయకులు జలగడుగుల సురేష్, బొడ్డు రాజు, పొడుగు శ్రీను, మీసాల సన్నీ పాల్గొన్నారు.
టీడీపీ నేతల సంఘీభావం
మధురవాడ : మున్సిపల్ కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి నాగోతి శివాజీ అన్నారు. ఏడో వార్డు పరిధిలోని ద్రోణంరాజు కల్యాణ మండపం వద్ద మున్సి పల్ కార్మికులు వంటా వార్పు చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయని, మరోవైపు కార్మికుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే ఉండ డంతో పారిశుధ్యం లోపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం చొరవ తీసుకొని కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చి సమ్మె విరమింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతిన బుజ్జి, పోతిన సోం బాబు, తదితరులు పాల్గొన్నారు.
సాగర్నగర్ : సాగర్నగర్ అల్లూరి సీతారామరాజు జంక్షన్లో కార్మికులు వంటవార్పుతో నిరసన వ్యక్తం చేశారు. సమ్మెకు జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి పంచకర్ల సందీప్, శాఖరి శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు అండగా వుంటామని మాయ మాటలు చెప్పి అధి కారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆ హామీలను విస్మరించారన్నారు. సమ్మెకు ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బి. దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.