రూ.130 కోట్లతో నగర సుందరీకరణ
ABN , First Publish Date - 2023-02-07T01:30:09+05:30 IST
వచ్చే నెల పెట్టుబడుల సదస్సు, జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో నగరంలో మౌలిక వసతుల కల్పన, రహదారుల మరమ్మతులు, ముఖ్య కూడళ్ల వద్ద సుందరీకరణ పనుల కోసం రూ.130 కోట్లు వెచ్చించనున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు.

మౌలిక వసతుల కల్పన, రహదారుల మరమ్మతులు కూడా చేపడతాం
ముఖ్య కూడళ్లలో విద్యుత్ కాంతులు
జోడుగుళ్లపాలెం, సాగర్నగర్, మంగమారిపేట, తొట్లకొండ వద్ద బీచ్లు అభివృద్ధి
వచ్చే నెల 3, 4 తేదీల్లో పెట్టుబడులు సదస్సు,
28, 29 తేదీల్లో జీ-20 సదస్సు
కలెక్టర్ మల్లికార్జున
విశాఖపట్నం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల పెట్టుబడుల సదస్సు, జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో నగరంలో మౌలిక వసతుల కల్పన, రహదారుల మరమ్మతులు, ముఖ్య కూడళ్ల వద్ద సుందరీకరణ పనుల కోసం రూ.130 కోట్లు వెచ్చించనున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. సోమవారం తన ఛాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్టు నుంచి ఎన్ఏడీ, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఆర్కే బీచ్రోడ్డు వరకూ, జాతీయ రహదారిపై తాటిచెట్లపాలెం నుంచి మద్దిలపాలెం వరకు, ఎయిర్పోర్టు వెనుక షీలానగర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ మీదుగా ఫ్లైవోవర్ వరకూ గల రహదారుల మరమ్మతు, సుందరీకరణ పనులు చేపడతామన్నారు. నగరంలో ప్రధాన కూడళ్లను అందంగా అలంకరించనున్నామన్నారు. ముఖ్య కూడళ్ల వద్ద లైటింగ్, సుందరీకరణ పనులకు సాయం చేసేందుకు నగరంలో పది మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో వచ్చే నెల 3,4 తేదీల్లో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి ఏర్పాట్లు ప్రారంభమవుతాయన్నారు. వేదికలు, స్టాళ్లు, డైనింగ్, సమావేశ మందిరాలు ఏర్పాటుచేసే బాధ్యతను ఢిల్లీకి చెందిన ఒక సంస్థ తీసుకుందన్నారు. రానున్న ప్రతినిధులకు లైజనింగ్ అధికారుల నియామకం, వాహనాలు, గదులు కేటాయింపు వంటి అంశాలపై కమిటీలను వేశామన్నారు. అలాగే వచ్చే నెల 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు రుషికొండలోని రాడిసిన్ బ్లూ హోటల్లో జరుగుతుందన్నారు. కాగా ఆర్కే బీచ్లో రద్దీ తగ్గించడానికి జోడుగుళ్లపాలెం, సాగర్నగర్, మంగమారిపేట, తొట్లకొండ వద్ద బీచ్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతిచోట్ల సందర్శకులకు కనీస సదుపాయాలైన మరుగుదొడ్లు, డ్రస్ ఛేంజ్ రూమ్స్, సెక్యూరిటీ పోస్టు, లైటింగ్ ఏర్పాటు వంటి ప్రతిపాదించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు.