చంద్రబాబుకు బాసట
ABN , First Publish Date - 2023-09-18T01:23:29+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.

పలు మండలాల్లో దీక్షలు, ఆలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు
మాడుగుల, సెప్టెంబరు 17 : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన నాటినుంచి కూల్చి వేతలు, అణచివేతలు, దౌర్జన్యాలతోనే పాలన సాగింది తప్ప, అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్లు చేపడుతున్న యాత్రలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడం వల్లే సీఎం జగన్ ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు పైలా ప్రసాదరావు, రంజిత్వర్మ, అద్దెపల్లి జాగ్గారావు, ఉండూరు దేముడు, లెక్కల కాశిబాబు, సూర్యనారాయణరాజు, మరువాడ ఈశ్వరరావుతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు.
చోడవరం : అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబునాయుడు క్షేమంగా విడుదల కావాలంటూ ఆదివారం పట్టణంలోని ఎడ్లవీధి చర్చిలో టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే రాజు ప్రార్థనలు జరిపారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా చంద్రబాబును వేధింపులకు గురిచేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, మాజీ ఎంపీపీ పెదబాబు, ఎలకా మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
చీడికాడ : చంద్రబాబు పేటరి చీడికాడ చర్చిలో టీడీపీ మహిళా ప్రతినిధులు ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం కుట్రలను ఛేదించుకుని చంద్రబాబు ఆరోగ్యంగా బయటకు రావాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా విభాగం కోశాధికారిణి పోతల రమణమ్మ, మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు లక్ష్మి, చీడికాడ సర్పంచ్ గాలి సామాలమ్మ, ఉపసర్పంచ్ రొంగలి లక్ష్మి తదితరలులు పాల్గొన్నారు.
రోలుగుంట : వైసీపీ కుట్రల నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడాలని కోరుతూ టీడీపీ మండల నాయకులు పాడేరు ఘాట్ మార్గంలోని మోదకొండమ్మ అమ్మవారి పాదాల వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ వైస్ ఎంపీపీ పరిసం లోవరాజు, జె.నాయుడుపాలెం టీడీపీ యూత్ నాయకులు బోడాపాత్రుని నరేష్ తదితరులు అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని వారు పిలుపునిచ్చారు.
నర్సీపట్నం అర్బన్ : టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంగా జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ మండలంలోని అమలాపురంలో గల రామాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు పైల గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో మాకిరెడ్డి నానాజీ, లాలం గోవింద, పైల వరహాలబాబు, బెన్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
నాతవరం : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నాతవరంలో ఆదివారం రాత్రి టీడీపీ, జనసేన నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు నాతవరం దేవాంగుల వీధిలో గల వినాయక ఆలయం వద్ద 110 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబునాయుడు క్షేమంగా, త్వరగా ఇంటికి చేరాలని పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
రావికమతం : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆదివారం రావికమతంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు కర్రపత్రాలు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ గంజి మోదునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా వారపు సంతలోని దుకాణాలు, వ్యాపారులకు కర్ర పత్రాలు అందజేసి, చంద్రబాబు అరెస్టుపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్షసాధింపు ధోరణిని వివరించారు. మండల తెలుగు యువత అధ్యక్షుడు ఉప్పులూరి నాగేశ్వరరావు, జనసేన నాయకులు గంజి శ్రీను, టీడీపీ నాయకులు ఈశ్వరరావు, పులగాయ సత్యనారాయణ, వేపాడ శ్రీను, గంజి అప్పలనాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు.