సబ్ ట్రెజరీ అధికారులకు టోపీ?
ABN , First Publish Date - 2023-01-29T00:57:11+05:30 IST
ఏసీబీ అధికారులమంటూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలువురు సబ్ ట్రెజరీ అధికారుల నుంచి ఒక ముఠా రూ.లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది.
ఏసీబీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ టోకరా
ఉమ్మడి విశాఖ జిల్లాలో రూ.లక్షల్లో వసూలు
పెదవివిప్పని బాధిత అధికారులు
విశాఖపట్నం, చోడవరం, జనవరి 28:
ఏసీబీ అధికారులమంటూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలువురు సబ్ ట్రెజరీ అధికారుల నుంచి ఒక ముఠా రూ.లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. సుమారు ఎనిమిది నుంచి పది మంది సబ్ ట్రెజరీ అధికారులకు ఇటీవల కొందరు ఫోన్ చేసి ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. ‘మీరు సంపాదించిన అక్రమ ఆస్తులు, ఇతర ఆదాయాలకు సంబంధించిన సమగ్ర సమాచారం మా వద్ద ఉంది. మేం అడిగినంత ముట్టజెప్పని పక్షంలో మీపై దాడులు తప్పవు’ అని హెచ్చరించడంతో ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి ఐదు లక్షల వరకూ సమర్పించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన కొందరు సబ్ ట్రెజరీ అధికారులు ఒకరికొకరు మాట్లాడుకుని...తామంతా మోసపోయామని గ్రహించారు. విషయాన్ని జిల్లా ట్రెజరీ అధికారి దృష్టికి వారంతా తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. కాగా ఘరానా మోసగాళ్ల వలలో పడిన సబ్ట్రెజరీ అధికారులు ఈ వ్యవహారంపై తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్పందించడానికి కూడా ఇష్టపడడం లేదు.