మండిన సూరీడు

ABN , First Publish Date - 2023-04-14T01:22:23+05:30 IST

జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగు తోంది. గురువారం అత్యధిక ఉష్ణోగ్రత 39.2 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 24.5 డిగ్రీలుగా నమోదైనట్టు స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.

మండిన సూరీడు
అనకాపల్లిలో నిర్మానుష్యంగా ఉన్న ఎన్టీఆర్‌ మార్కెట్‌యార్డు రోడ్డు

నర్సీపట్నంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

అనకాపల్లిలో 39.2 డిగ్రీలు

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 13: జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగు తోంది. గురువారం అత్యధిక ఉష్ణోగ్రత 39.2 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 24.5 డిగ్రీలుగా నమోదైనట్టు స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. ఉదయం నుంచి వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. పది గంటలు దాటిన తరువాత ప్రధాన రహదారుల్లో జనసందడి తగ్గింది. రోడ్లపై అమ్మకాలు సాగించే చిరు వ్యాపారులు ఎండ వేడికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్మికులు చెట్టు నీడన లగేజి రిక్షాలపై సేద తీరాల్సి వచ్చింది. నెహ్రూచౌక్‌, ఎన్టీఆర్‌ జంక్షన్‌, మెయిన్‌రోడ్డు, చిననాలుగురోడ్ల జంక్షన్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్కెట్‌యార్డు రోడ్లు మధ్యాహ్నం ఒంటిగంట సమయానికే బోసిపోయాయి. శీతలపానీయాల దుకాణాలు కిక్కిరిశాయి. వివిధ పనులపై గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఉష్ణోగ్రతలకు అల్లాడిపోయారు. పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు పాదచారులకు చల్లటి తాగునీటిని అందివ్వడంతో వాటిని తాగి ప్రజలు ఉపశమనం పొందారు.

నర్సీపట్నంలో..

నర్సీపట్నం : వేసవి ఆరంభంలోనే ఈ ఏడాది అగ్గిపుట్టిస్తోంది. గురువారం నాటి పగటి ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోయారు. నర్సీపట్నంలో మధ్యాహ్నం ఒంటి గంటకు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం 35 డిగ్రీలులోపు ఉంది. మూడు రోజులుగా 38 డిగ్రీల నుంచి ఒక్కసారిగా 41 డిగ్రీలకు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ చాలా వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇక పిల్లలు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

Updated Date - 2023-04-14T01:22:23+05:30 IST