ఈదురు గాలులకు నేలకొరిగిన తమలపాకు, అరటి తోటలు
ABN , First Publish Date - 2023-05-27T00:52:18+05:30 IST
మండలంలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షంతోపాటు ఈదురుగాలులు వీచడంతో పలు గ్రామాల్లో తమలపాకు, అరటి తోటలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విగిరిపోయాయి. ఈదురు గాలుల కారణంగా సత్యవరం, మాసాహెబ్పేట, మంగవరం తదితర గ్రామాల్లో తమలపాకు, అరటి తోటలు పడిపోయాయి. శుక్రవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు.. నేలవాలిన తోటలను చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. పంట చేతికొచ్చే సమయంలో ఈదురుగాలులు తీవ్ర నష్టం కలిగించాయని రైతులు వాపోతున్నారు.

తీవ్రంగా నష్టపోయిన రైతులు
ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
పాయకరావుపేట రూరల్, మే 26: మండలంలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షంతోపాటు ఈదురుగాలులు వీచడంతో పలు గ్రామాల్లో తమలపాకు, అరటి తోటలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విగిరిపోయాయి. ఈదురు గాలుల కారణంగా సత్యవరం, మాసాహెబ్పేట, మంగవరం తదితర గ్రామాల్లో తమలపాకు, అరటి తోటలు పడిపోయాయి. శుక్రవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు.. నేలవాలిన తోటలను చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. పంట చేతికొచ్చే సమయంలో ఈదురుగాలులు తీవ్ర నష్టం కలిగించాయని రైతులు వాపోతున్నారు. తమలపాకు తోటను రెండు లక్షల రూపాయలకు కౌలుకు తీసుకున్నానని, వారం రోజుల్లో ఆకు కోత మొదలుపెట్టాలని భావిస్తుండగా గురువారం వీచిన ఈదురు గాలులకు మొత్తం నేలపాలైందని తమిర్సి సత్యనారాయణ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, ఈదురుగాలులకు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని తమలపాకు, అరటి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఉద్యానవన శాఖాధికారి ఉమామహేశ్వరి శుక్రవారం పలుగ్రామాల్లో పర్యటించి నేలకొరిగిన తమలపాకు, అరటి తోటలను పరిశీలించారు. సుమారు 28 ఎకరాల్లో అరటి, తమలపాకు తోటలు దెబ్బతిన్నాయని, ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆమె చెప్పారు.