ఇంటి వద్దనే పన్ను చెల్లింపు!
ABN , First Publish Date - 2023-09-04T00:48:41+05:30 IST
జీవీఎంసీ పన్నులు, ఇతర చార్జీలను నగర వాసులు ఇకపై తమ ఇంటి వద్దనే చెల్లించే సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. పీఓఎస్ యంత్రాలతో వార్డు సచివాలయం అడ్మిన్ సెక్రటరీలు ఇంటింటికీ వెళ్లి పన్నులు, చార్జీలను కట్టించుకుంటారు. దీనిపై ఇప్పటికే సచివాయల కార్యదర్శులు, బ్యాంకర్తలతో శిక్షణ పూర్తయింది. ఈ విధానాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
వార్డు సచివాలయం అడ్మిన్ల చేతికి పీఓఎస్ యంత్రాలు
25 రకాల పన్నులు, చార్జీల చెల్లింపులకు అవకాశం
వసూలుపై సచివాలయాల కార్యదర్శులకు శిక్షణ ఇచ్చిన బ్యాంకర్లు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పన్నులు, ఇతర చార్జీలను నగర వాసులు ఇకపై తమ ఇంటి వద్దనే చెల్లించే సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. పీఓఎస్ యంత్రాలతో వార్డు సచివాలయం అడ్మిన్ సెక్రటరీలు ఇంటింటికీ వెళ్లి పన్నులు, చార్జీలను కట్టించుకుంటారు. దీనిపై ఇప్పటికే సచివాయల కార్యదర్శులు, బ్యాంకర్తలతో శిక్షణ పూర్తయింది. ఈ విధానాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
జీవీఎంసీ పరిధిలో సుమారు 5.5 లక్షల ఆస్తిపన్ను అసెస్మెంట్లున్నాయి. ఇవికాకుండా కొళాయి కనెక్షన్లు, ట్రేడ్ లైసెన్స్లు, యూజర్చార్జీలు, ఖాళీ స్థలాలతోపాటు 25 రకాల పన్నులను ఏటా వసూలు చేస్తుంటారు. ఆయా పన్నులు, చార్జీలను ఆన్లైన్లో లేదంటే జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లోని సౌకర్యం కేంద్రాలకు వెళ్లి నేరుగా చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల సౌకర్యం కేంద్రాల్లో తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. అంతేకాకుండా సర్వర్డౌన్, నెట్వర్క్ సమస్యలు తలెత్తితే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో నగరవాసులు సకాలంలో పన్నులు, చార్జీలు చెల్లించడం ఇబ్బందిగా మారుతోంది. సకాలంలో చెల్లింపు జరగకపోతే జరిమానా రూపంలో అదనంగా కట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు ప్రత్యామ్నాయంపై దృష్టిసారించారు.
వార్డు సచివాలయం అడ్మిన్ కార్యదర్శులకు ఇప్పటికే బిల్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించడంతో వారంతా సచివాలయాల్లో కొన్ని రకాల పన్నులు, చార్జీలను కట్టించుకుంటున్నారు. ఇందుకోసం సచివాలయానికి వెళ్లాల్సివుంటుంది. ఇది కూడా ఇబ్బందిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో సచివాలయం అడ్మిన్ కార్యదర్శులకే పీఓఎస్ యంత్రాలను ఇచ్చి, వారు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి పన్నులు, చార్జీలను వసూలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వార్డు సచివాలయంలోని కార్యదర్శులంతా తమ విభాగానికి సంబంధించిన ప్రజలు చెల్లించాల్సిన పన్నులు, చార్జీలను గుర్తించి జాబితా రూపొందించుకోవాలి. ఉదాహరణకు ట్రేడ్ లైసెన్స్లు చెల్లించాల్సిన వారి వివరాలను వార్డు శానిటేషన్ సెక్రటరీ సిద్ధం చేసుకుని, వారి వద్దకు పీఓఎస్ యంత్రాలను తీసుకెళ్లి లైసెన్స్ ఫీజులను కట్టించుకోవాలి. అలాగే నీటికొళాయి చార్జీలు కట్టాల్సినవారి జాబితాను వార్డు ఎమినిటీస్ సెక్రటరీ తయారుచేసుకుని ఇళ్లకు వెళ్లి వసూలు చేయాలి. ఆస్తిపన్నును వార్డు అడ్మిన్ సెక్రటరీలు వసూలు చేయాలి. చివరగా పీఓఎస్ యంత్రాల నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం వార్డు అడ్మిన్ సెక్రటరీలే చూసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రజలు నుంచి సకాలంలో పన్నులు వసూలు చేయడంతోపాటు, వారికి సమయం ఆదా చేసినట్టయివుతుందన్నది అధికారుల ఆలోచన. ఇదిలావుండగా పన్నుల వసూలుపై జీవీంఎసీ పరిధిలోని 578 వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి విడతలవారీగా ఐడీబీఐ బ్యాంక్ అధికారులతో శిక్షణ ఇప్పించారు. యంత్రాల కొనుగోలు ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. మిగిలిన ఏర్పాట్లను వీలైనంత త్వరగా పూర్తిచేసి ఇంటింటికీ వెళ్లి పన్నులు, చార్జీలు వసూలు చేసే కార్యక్రమాన్ని అమల్లోకి తేవాలని అధికారులు యత్నిస్తున్నారు.