21న అప్పన్న తెప్పోత్సవం
ABN , First Publish Date - 2023-01-17T23:36:00+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం ఈనెల 21వ తేదీన జరగనుంది. ఏటా సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే వార్షికోత్సవాల్లో భాగంగా పుష్యమాస బహుళపక్ష అమావాస్య నాడు తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సింహాచలం, జనవరి 17 : వరాహలక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం ఈనెల 21వ తేదీన జరగనుంది. ఏటా సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే వార్షికోత్సవాల్లో భాగంగా పుష్యమాస బహుళపక్ష అమావాస్య నాడు తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు ఈఏడాది కూడా కొండదిగువ పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అవసరమైన హంసాకృతి తెప్పను దేవస్థానం కార్యనిర్వాహక ఇంజినీరు బండారు రాంబాబు పర్యవేక్షణలో సిబ్బంది తయారు చేస్తున్నారు. ఇప్పటికే పుష్కరిణి పరసరాలు శుభ్రం చేయడం, రంగులద్దడం వంటి పనులను పూర్తి చేసి శోభాయమానంగా తీర్చిదిద్దారు. కాగా తెప్పోత్సవానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పాలక మండలి సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మంగళవారం పరిశీలించారు. మెట్లకు పట్టిన నాచును శుభ్రం చేయాలని, నీటిలోని వ్యర్థాలను తొలగించాలని సిబ్బందికి సూచించారు.