నిఫాపై అప్రమత్తం
ABN , First Publish Date - 2023-09-27T01:12:12+05:30 IST
నిఫా వైరస్ కేరళను వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను అప్రమ్తతమైంది.
కేజీహెచ్లో 30 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు
అనుమానిత కేసులు వస్తే సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న సూపరింటెండెంట్
విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
నిఫా వైరస్ కేరళను వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను అప్రమ్తతమైంది. ఈ మేరకు డీఎంఈ ఆదేశాలతో కేజీహెచ్లో అధికారులు ప్రత్యేకంగా వార్డును ఏర్పాటుచేశారు. క్యాజువాల్టీ మొదటి అంతస్థులోని ఐసోలేషన్ వార్డులో 30 పడకలు సిద్ధం చేశారు. కేరళ నుంచి నగరానికి వచ్చే వారిలో లక్షణాలు కనిపిస్తే వైద్య సేవలు అందించేందుకు అనుగుణంగా పది మంది సిబ్బందిని నియమించారు.
నిఫా వైరస్ పందులు, గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతోంది. అయితే మనుషుల నుంచి మనుషులకు కూడా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు అక్కడి వైద్యులు గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ వైరస్ బారినపడిన వారిలో శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తుంటాయి. వైరస్ బారినపడిన వారిలో 70 శాతం మంది ప్రాణాలను కోల్పోతుంటారు. ఈ వైరస్కు సరైన మందులు, వ్యాక్సిన్ లేకపోవడం ప్రధాన సమస్య. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటే వారిని అనుమానించి పరీక్షలు చేస్తుంటారు. కేరళ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఈ తరహా లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలతో వార్డును ఏర్పాటుచేశామని, అనుమానిత కేసులు వస్తే చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
ఇవీ లక్షణాలు..
నిఫా వైరస్ బారినపడిన వారిలో దాదాపు కొవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తాయి. మనిషి నోటి నుంచి వచ్చే తుంపర్లు ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ బారినపడిన వారిలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం ఉంటాయి. ఇవి క్రమంగా న్యుమోనియాకు దారితీస్తాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కొందరిలో బ్రెయిన్ కన్ఫ్యూజన్కు గురై అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఈ వైరస్కు మందులు లేకపోవడం వల్ల లక్షణాలను బట్టి చికిత్స అందిస్తుంటారని ఆంధ్ర మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు. లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం కావాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఈ లక్షణాలు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయరాదన్నారు.