పశు నష్ట పరిహార పథకం రద్దు
ABN , First Publish Date - 2023-03-05T01:41:51+05:30 IST
వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల క్రితం ప్రారంభించిన వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాన్ని రెండు వారాల క్రితం రద్దు చేసింది.
ఇటీవల ఆదేశాలు
ఇకపై రైతుల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకోవద్దని ఉత్తర్వులు
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సుమారు 1,500 దరఖాస్తులు పెండింగ్
రెండేళ్ల నుంచి అందని పరిహారం
విశాఖపట్నం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):
వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల క్రితం ప్రారంభించిన వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాన్ని రెండు వారాల క్రితం రద్దు చేసింది. అధికారంలోకి వస్తే పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు అండగా వుంటామని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి...సీఎం అయిన తరువాత 2019లో వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాన్ని ప్రకటించారు.
పాడి పశువులైన ఆవులు, గేదెలు, ఇంకా గొర్రెలు, మేకలు వ్యాధుల బారిన లేదా ఏదైనా ప్రమాదం అంటే పిడుగులు పడి/రోడ్డు/రైలు ప్రమాదాలు/విద్యుత్ షాక్కు గురై చనిపోతే సంబంధిత రైతులు/పోషకులకు ఈ పథకం కింద సాయం అందుతుంది. రెండేళ్ల నుంచి పదేళ్లలోపు దేశవాళీ ఆవులు/గేదెలు మృతి చెందితే ఒక్కొక్క దానికి రూ.15 వేలు, సంకర, జెర్సీ, ముర్రా జాతి పాడి పశువులు చనిపోతే రూ.30 వేల పరిహారం అందిస్తారు. అలాగే ఆరు నెలలకు పైబడిన గొర్రెలు/మేకలు చనిపోతే రూ.ఆరు వేలు గరిష్ఠంగా ఒక కుటుంబానికి రూ.20 వేలు అందిస్తారు. అయితే ఒకేసారి మూడు జీవాలు చనిపోతేనే ఈ పథకం వర్తిస్తోంది. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో 2021 వరకు సుమారు 1,800 మంది రైతులు/పోషకులకు రూ.మూడు కోట్ల వరకు పరిహారం అందజేశారు. తరువాత ఏమైందోగానీ 2021 ఏప్రిల్ నుంచి పరిహారం కింద ఒక్క పైసా విడుదల చేయలేదు. అయితే దరఖాస్తులు మాత్రం స్వీకరించారు. గత నెలాఖరు వరకు ఉమ్మడి జిల్లాలో సుమారు 1,500 దరఖాస్తులు వచ్చాయి. వీటికి సంబంధించి రూ.రెండున్నర కోట్లు వరకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. పరిహారం కోసం రెండేళ్లుగా రైతులు/పోషకులు...అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పథకంలో లోపాలను సవరించి...దీనికంటే గొప్ప పథకం తీసుకువస్తామని చెబుతూ ప్రభుత్వం పశు నష్టపరిహార పథకాన్ని రద్దు చేసింది. ఈ మేరకు పరిహారం కోసం రైతుల నుంచి ఇకపై దరఖాస్తులు స్వీకరించరాదని పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ దరఖాస్తులు తీసుకోబోమని విశాఖ జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ రామకృష్ణ ధ్రువీకరించారు. ఇప్పటికే నష్టపోయిన పశు పోషకులకు పరిహారం ఇవ్వకుండా...త్వరలో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.