ఆందోళనకు 500 రోజులు

ABN , First Publish Date - 2023-04-17T01:10:57+05:30 IST

హెటెరో ఔషధ పరిశ్రమ సముద్రంలోకి కొత్తగా వేస్తున్న పైపులైన్లకు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్‌ చేస్తూ మండలంలోని రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న మహా శాంతియుత ధర్నా ఆదివారంనాటికి 500వ రోజుకు చేరుకుంది.

ఆందోళనకు 500 రోజులు

16ఎన్‌కేపీ1 : రాజయ్యపేటలో మహాశాంతియుత ధర్నా చేస్తున్న మత్స్యకారులు

సముద్రంలోకి ‘హెటెరో’ కొత్త పైపులైన్ల ఏర్పాటుకు అనుమతులను రద్దు చేయాలని డిమాండ్‌

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు

నక్కపల్లి, ఏప్రిల్‌ 16 : హెటెరో ఔషధ పరిశ్రమ సముద్రంలోకి కొత్తగా వేస్తున్న పైపులైన్లకు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్‌ చేస్తూ మండలంలోని రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న మహా శాంతియుత ధర్నా ఆదివారంనాటికి 500వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీరికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు ఎం.అప్పలరాజు సంఘీభావం తెలిపారు. అనంతరం వీరంతా మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఐదు వందల రోజులుగా మత్స్యకారులు శాంతియుతంగా ఆందోళనే చేపడుతున్నా ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెటెరో ఔషధ పరిశ్రమ శుద్ధి చేయని ప్రమాదకర వ్యర్థ జలాలను సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల మత్స్య సంపద నాశనమవుతోందని పేర్కొన్నారు. మత్స్యకార సం ఘాల నాయకులు మాట్లాడుతూ హెటెరో ఔషధ పరిశ్రమకు కొత్తపైపులైన్ల కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, అంతవరకూ తాము ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రాణాలైనా అర్పిస్తామని, పైపులైన్‌ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు పిక్కి కామేశ్వరరావు, పిక్కి రాంబాబు, పిక్కి సత్తియ్య, పిక్కి కోదండరావు, వాసు పల్లి నూకరాజులతో పాటు గోసల కాశీరావు, జాన్‌, మహేశ్‌, గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-17T01:10:57+05:30 IST