ఆయుష్ క్షీణం
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:40 AM
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలో నిర్మించిన ఆయుష్ నేచురోపతి ప్రకృతి వైద్య కేంద్రం ఆరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దీంతో భవనం శిథిలావస్థకు చేరుకుంటోంది.
- ఆరేళ్లుగా నిరుపయోగంగా ఆయుష్ నేచురోపతి ప్రకృతి వైద్య కేంద్రం
- అధికారులు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరిన వైనం
నర్సీపట్నం, డిసెంబరు 23: స్థానిక ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలో నిర్మించిన ఆయుష్ నేచురోపతి ప్రకృతి వైద్య కేంద్రం ఆరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దీంతో భవనం శిథిలావస్థకు చేరుకుంటోంది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నంలో ప్రకృతి వైద్యం, యోగా కేంద్రం కోసం భవన నిర్మాణాలు చేపట్టారు. ఒక్కొక్క భవనానికి ఆయుష్ శాఖ రూ.20 లక్షలు మంజూరు చేసింది. అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు చొరవతో ప్రాంతీయ ఆస్పత్రిని ఆనుకొని ఉన్న స్థలాన్ని ప్రకృతి వైద్యం భవన నిర్మాణానికి కేటాయించారు. ఏరియా ఆస్పత్రిని ఆనుకొని ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని భావించారు. ప్రకృతి వైద్యం, యోగా కేంద్రానికి అవసరమైన సిబ్బందిని నియమించకుండా ముందు భవనం నిర్మించడానికి నిధులు మంజూరు చేసి ఆయుష్ విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి.
నెరవేరని లక్ష్యం
భవన నిర్మాణ పనులు చాలా వరకూ పూర్తి చేశారు. ప్రహరీ గోడ, బోరు, విద్యుత్ సదుపాయం వంటి ఫినిషింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. 2017 డిసెంబరులో ఆయుష్ ఆస్పత్రి భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రకృతి వైద్య కేంద్రం కోసం భవనమైతే నిర్మించారు గాని వైద్య అధికారి, యోగా ఇన్స్ట్రక్టర్, సిబ్బందిని మంజూరు చేయడానికి ఆయుష్ అధికారులు కృషి చేయలేదు. దీనికి తోడు కాంట్రాక్టరుకి బిల్లులు బకాయిలు ఉండడంతో అసంపూర్తిగా పనులు ఆపేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా మిగిలిన పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో ఆరేళ్లుగా భవనం నిరుపయోగంగా ఉండిపోయింది. దీంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఆవరణమంతా పిచ్చి మొక్కలు పెరిగిపోయి బూత్ బంగ్లాను తలపిస్తోంది. రూ.20 లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉంచడం విమర్శలకు తావిస్తోంది. మిగిలిన పనులకు నిధులు మంజూరు చేసి, ప్రకృతి వైద్య కేంద్రానికి సిబ్బందిని మంజూరు చేస్తే ఎంతో ఉపయోగ పడుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.