Share News

Natti Kumar: వ్యూహం మూవీ గురించి నేను అలా చెప్పలేదు

ABN , Publish Date - Dec 29 , 2023 | 07:44 PM

వ్యూహం మూవీ విడుదలకు కొన్ని గంటలకు ముందే రిలీజ్ ఆపాలని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Natti Kumar: వ్యూహం మూవీ గురించి నేను అలా చెప్పలేదు

రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్రం గురించి టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తాజాగా మరోసారి స్పందించారు. ఈ సినిమా విడుదల ఆపాలని తాము సెన్సార్ బోర్డును కోరలేదని స్పష్టం చేశారు. కానీ ఈ మూవీ ద్వారా ఎవరిని కూడా విమర్శించొద్దని చెప్పినట్లు గుర్తు చేశారు. దీంతోపాటు సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లాంటి వారిని వ్యంగ్యంగా చూపించకూడదని కోరినట్లు వెల్లడించారు. అయినప్పటికీ వాటిని పరిశీలించకుండానే సెన్సార్ పూర్తి చేశారని తెలిపారు. అంతేకాదు జీవిత రాజశేఖర్ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి వారిని తప్పించమని సెన్సార్ బోర్డును కోరినట్లు చెప్పారు.


అయితే వ్యూహం సినిమా విడుదలకు ముందే ఈ సినిమా రిలీజ్ ఆపాలని తెలంగాణ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ఆధారంగా సినిమా రిలీజ్ చేయడం కుదరదని చెప్పింది. ఆ క్రమంలో రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక సాక్ష్యాల ఆధారాల మేరకు ఈ చిత్ర ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఆ క్రమంలోనే ఈ కేసు తీర్పును జనవరి 11కు కోర్టు వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యూహం సినిమా తీశారని కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద గురువారం విచారించి ఈ మేరకు తీర్పు వెలువరించారు.


మరోవైపు ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని నట్టి కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగు దేశం పార్టీ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి 152 సీట్లు, వైసీపీకి 23 సీట్లు వస్తాయని నట్టి జోస్యం చెప్పారు.

Updated Date - Dec 29 , 2023 | 07:49 PM