AP News: మండిన రాష్ట్రం

ABN , First Publish Date - 2023-05-11T21:25:53+05:30 IST

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు గురువారం ఎండ తీవ్రతకు మండిపోయాయి. ఇంకా పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. బంగాళాఖాతం (Bay of Bengal)లో ఉన్న తుఫాన్‌ దిశగా..

AP News: మండిన రాష్ట్రం

విశాఖపట్నం: రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు గురువారం ఎండ తీవ్రతకు మండిపోయాయి. ఇంకా పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. బంగాళాఖాతం (Bay of Bengal)లో ఉన్న తుఫాన్‌ దిశగా భూ ఉపరితలం నుంచి గాలులు వీయడం, ఇంకా వాతావరణం పొడిగా వుండడంతో అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District)లోని గుమ్మలక్ష్మిపురంలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలో నాలుగు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 60 మండలాల్లో గాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శనివారం ఎండలు మరింత పెరగనున్నాయని, 32 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 192 మండలాల్లో గాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. కాగా శుక్రవారం నుంచి రాష్ట్రంలో గాడ్పుల తీవ్రత పెరిగి పగటి ఉష్ణోగ్రతలు అనేకచోట్ల 40 డిగ్రీలు, శనివారం నుంచి కొన్నిచోట్ల 45 డిగ్రీలకు అటుఇటుగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో తుఫాన్‌ ఈనెల 14న తీరం దాటనున్నందున బహుశా మరో వారం రోజులు రాష్ట్రంలో గాడ్పుల తీవ్రత ఉంటుందని చెబుతూ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని పేర్కొంటూ ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా దక్షిణ కోస్తా నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాయలసీమ (Rayalaseema), కోస్తాల్లో పలుచోట్ల గురువారం వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2023-05-11T21:25:53+05:30 IST