ఎక్కడ ధాన్యం అక్కడే
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:14 AM
ధాన్యం కొనుగోలులో పారదర్శకత పాటిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో మాత్రం ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఎక్కడ ధాన్యం అక్కడే ఉండిపోతున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలు, సమన్వయలోపం కారణంగా కిందిస్థాయి సిబ్బందికి, రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- నిలిచిన కొనుగోలు ప్రక్రియ
- ప్యాడీ ప్రొక్యూర్మెంట్ యాప్లో తలెత్తిన సమస్యలు
- వాహన జీపీఎస్ సేవల్లో అంతరాయం
- రవాణాకు బ్రేకులు.. ఆందోళనలో రైతులు
(టెక్కలి)
టెక్కలి మండలం నర్శింగపల్లి రైతుభరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో 11 ధాన్యం రవాణా వాహనాలకు పది రోజుల కిందట జీపీఎస్ పరికరాలు అమర్చారు. అందులో మూడు వాహనాలు మాత్రమే యాక్టివేట్ కాగా, మిగిలిన ఎనిమిది వాహనాలకు సంబంధించి ఔటాఫ్ నెట్వర్క్ అని చూపుతున్నాయి. దీంతో ధాన్యం రవాణా నిలిచిపోయింది.
..................
టెక్కలి మండలం నర్శింగపల్లి ఆర్బీకే పరిధిలో వట్టికూళ్ల దుర్యోధనరావు అనే వాహన యజమాని... జంతూరు ప్రసాద్ అనే రైతుకు చెందిన 62 బస్తాల ధాన్యాన్ని ఇటీవల టెక్కలిలోని ఓ రైస్మిల్లుకు తీసుకువెళ్లారు. సాంకేతిక లోపం కారణంగా మిల్లర్ లాగిన్లో జీపీఎస్ యాక్టివేట్ కాలేదు. రోజంతా నిరీక్షించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతు, వాహన యజమాని అసహనం చెందారు.
...................
పోలాకి మండలం గాతలవలసకు చెందిన రైతులు ఇటీవల రెండు వాహనాల్లో ధాన్యం ఎక్కించగా.. సాంకేతిక లోపం కారణంగా మిల్లుల్లో వాటిని దించని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతూ అక్కడ అధికారులను నిలదీశారు.
...................
టెక్కలి మండలం కె.కొత్తూరు సచివాలయం చాకిపల్లి గ్రామానికి చెందిన పంగ అప్పారావు అనే రైతు ఈనెల 13న సచివాలయంలో ట్రక్సీటు తీసుకొని ధాన్యాన్ని టెక్కలిలో ఓ మిల్లుకు పంపించినా సాంకేతిక సమస్యల కారణంగా ఆ ధాన్యం మిల్లరు దించలేదు. దీంతో అప్పారావు ఆ ట్రాక్టర్కు రోజుకు రూ.2వేలు అదనంగా అద్దె చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని అప్పారావు వాపోతున్నారు.
....................
ధాన్యం కొనుగోలులో పారదర్శకత పాటిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో మాత్రం ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఎక్కడ ధాన్యం అక్కడే ఉండిపోతున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలు, సమన్వయలోపం కారణంగా కిందిస్థాయి సిబ్బందికి, రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ యాప్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. సమస్యను అధిగమించేందుకుగానూ రెండు రోజుల పాటు ధాన్యం కొనుగోలు ఆపాలని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో రైతుభరోసా కేంద్రాల పరిధిలోని ధాన్యం కొనుగోలుకు ట్రక్సీట్లు సైతం బయటకు రాని పరిస్థితి నెలకొంది. రైస్మిల్లులకు సంబంధించి జియోట్యాగింగ్ కో-ఆర్డినేట్ చేయడం, ధాన్యం రవాణా వాహనాలకు అమర్చిన జీపీఎస్ మిషన్లు ఆన్లైన్ చేయడం, పలురకాల ధాన్యం వెరైటీలు ప్రొక్యూర్మెంట్ యాప్లో చూపించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మిల్లర్లతో బ్యాంక్ గ్యారెంటీలు జరిపించడం, సాంకేతిక సిబ్బంది నియామకాలు చేపట్టి.. సాంకేతిక సమస్యలన్నీ అధిగమించాల్సి ఉంది.
- పనిచేయని వాహన జీపీఎస్లు
జిల్లాలో 620 రైతుభరోసా కేంద్రాల పరిధిలో సుమారు తొమ్మిదివేల ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటివరకు 20శాతం వాహనాలకు మాత్రమే జీపీఎస్ యాక్టివేట్ కాగా, మిగిలిన వాహనాల్లో ఔటాఫ్ నెట్వర్క్ అని చూపడంతో రైతుభరోసా కేంద్రాల్లో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. వీరఘట్టం, కొత్తూరు, సుబ్బమ్మపేట మండలాల్లో కొన్ని వాహనాలకు జీపీఎస్లు కూడా అమర్చని పరిస్థితి నెలకొంది. పలాస మండలం పరిధి బొడ్డపాడు, తాళ్లభద్ర, మొగిలిపాడు, గార మండలం వమరవల్లి, పాతపట్నం మండలం రొంపివలస ఇలా పలు మండలాల్లోని ఆర్బీకేల్లో సాంకేతిక సిబ్బంది నియామకాలు సైతం పూర్తిస్థాయిలో జరగలేదు. మరోవైపు సాంకేతిక సిబ్బంది ఉన్నచోట కొన్ని పరికరాలు, ప్రింటర్లకు కావాల్సిన క్యాట్రేజ్లు వంటివి లేని దుస్థితి. ఇప్పటికే మందస, పోలాకి మండలంలోని మబగాం.. ఇలా జిల్లాలోని పలు మిల్లులకు జీపీఎస్ ట్యాగింగ్ అవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో ధాన్యం రవాణా చేసే వాహన యజమానులు, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఓ జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లగా రెండు రోజుల్లో సాంకేతిక సమస్య అధిగమిస్తామని, కొనుగోళ్లు వేగవంతం చేస్తామని తెలిపారు. అలాగే సోమారం నుంచి కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగేలా చర్యలు చేపడతామని టెక్కలి తహసీల్దార్ ప్రవళ్లికాప్రియ తెలిపారు.