మా డబ్బులు ఏమయ్యాయి?
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:30 AM
ఓ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన కొంత మంది ఖాతాదారులు ఆర్ఎంవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే సారవకోటతో పాటు శ్రీకాకుళంలోని కార్యాలయానికి రోజూ చాలామంది వస్తున్నారు.
- ఓ మ్యూచువల్ ఫండ్ ఖాతాదారుల ఆందోళన
- తమకు సంబంధం లేదంటున్న ఆర్ఎంవో
- ఫిర్యాదులు స్వీకరించి.. బ్యాంకులకు మళ్లింపు
(శ్రీకాకుళం క్రైం)
ఓ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన కొంత మంది ఖాతాదారులు ఆర్ఎంవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే సారవకోటతో పాటు శ్రీకాకుళంలోని కార్యాలయానికి రోజూ చాలామంది వస్తున్నారు. తమ డబ్బులు ఏమ య్యాయని.. అసలు ఉన్నాయో.. లేవోనని ఆరా తీస్తున్నారు. కాగా.. బ్యాంక్కు, మ్యూచువల్ ఫండ్స్కు సంబంధం లేదని రీజనల్ మేనేజర్ సమాధానం చెబుతుండడంతో మరింత ఆందో ళన చెందుతున్నారు. ఇటీవల గార ఎస్బీఐలో ఖాతాదారులు కుదువపెట్టిన బంగారు ఆభరణా లు మాయమైన ఉదంతం తెరపైకి వచ్చిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది ఖాతా దారులు ఎస్బీఐ సంస్థల్లో దాచుకున్న డబ్బులను వెన క్కి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ మ్యూచువల్ ఫండ్స్లో తాము పెట్టిన పెట్టుబడులు మాయమై నట్టు గుర్తించారు. పీఎన్.కాలనీ జంక్షన్లో ఉన్న పందిరి వెంకట లక్ష్మీ రూ.5.05లక్షలు చొప్పున సదరు బ్యాంక్లో డీడీలు తీసి రెండు ప్రీమి యంలు కింద రూ.10.10లక్షలు కట్టారు. ఈ నగదు ఖాతాకు జమకానట్టు గుర్తించి.. ఇటీవల ఆర్ఎంవో కార్యాలయానికి వెళ్లి తన సొమ్ము కోసం నిలదీశారు. సదరు మ్యూచువల్ ఫండ్స్.. ప్రైవేటు సంస్థ అని, దానికి బ్యాంక్కు సంబంధం లేదని.. ఆర్ఎంవో చెప్పడంతో అవాక్కయ్యారు. తమ డబ్బుల పరి స్థితి ఏంటని ప్రశ్నించగా.. బాధితురాలితో ఫిర్యాదు పత్రాన్ని రాయించి దానిపై ఆర్ఎంవో సంతకం లేకుండానే సంబంధిత బ్యాంకు లకు పంపించారు. బ్యాంక్తో సంబంధం లేనప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి ఆ పేరు ఎందుకు పెట్టారని బాధితులు నిలదీస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఆర్ఎంవో కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేస్తుండడంతో.. డబ్బులు గోల్మాల్ చేసిన వ్యక్తులు రహస్యంగా వారికి సొమ్ములు చెల్లిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పందిరి వెంకటలక్ష్మికి కొద్దిరోజుల కిందట రూ.2లక్షలు, బుధవారం మరో రూ.లక్ష చెల్లించినట్టు తెలిసింది. కానీ దీనిపై ఆర్ఎంవో కానీ, బ్యాంకు సిబ్బంది కానీ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. పెద్దపాడు రోడ్డులోని మ్యూచువల్ ఫండ్స్ కార్యాలయంలో డిప్యూటేషన్పై నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న ఉద్యోగి (విజయనగరం శాఖకు చెందిన వ్యక్తి).. తాను ఖాతాదారులకు తప్ప ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదంటూ దాటవేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఖాతాదారులకు న్యాయం చేయకపోతే.. బ్యాంకుపై నమ్మకాన్ని పోగొట్టుకున్నట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పోలీసుల కస్టడీలో ఇద్దరు
గార ఎస్బీఐలోని బంగారం ఆభరణాలు మాయమైన ఘటనలో నిందితులుగా జైల్లో ఉన్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ నెల 8న గార ఎస్బీఐ బంగారు ఆభరణాల మాయం కేసులో పోలీసులు రూ.4.7 కోట్ల విలువైన 7.195.29 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ వై.శృతి ఆధ్వర్యంలో కేసును విచారణ చేపట్టారు. ఈ నేపఽథ్యంలో నాలుగు రోజుల కిందట జైల్లో ఉన్న పొన్నాడ తిరుమలరావు,ఉరిటి కిరణ్బాబును కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. దీంతో వారిద్దరిని విచారించేందుకు కోర్టు అంగీకరించింది. దీంతో శుక్రవారం వారిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారించారు. దీనిపై డీఎస్పీ శృతిని వివరణ కోరగా.. దర్యాప్తులో భాగంగా విచారించామని తెలిపారు. ఇదిలావుండగా క్యాషియర్ సురేష్పై జరిగిన దాడి ఘటనలో ఇంకా స్పష్టత రాలేదు. దాడికి పాల్పడింది ఎవరన్న అనుమానాల కన్నా.. అసలు నిజంగానే దాడి జరిగిందా? అన్న అనుమానాలు పోలీసులకు సైతం తలెత్తుతున్నాయి. సురేష్ పోలీసు విచారణకు దూరంగా ఉంటూ, ముందస్తు బెయిల్కు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది.