సమయం మార్చి.. గిరిజనులను ఏమార్చి
ABN , First Publish Date - 2023-05-02T00:07:28+05:30 IST
గిరిజన ప్రజల నుంచి ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నిరసన సెగ తగులుతున్న నేపథ్యంలో సోమవారం ఆమె సమయం మార్చి అప్పటికప్పుడు షెడ్యూల్లో మార్పు చేసి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు.
- గ్రామాల్లో పర్యటిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే
- గిరిజన సంఘాలకు కనపడకుండా జాగ్రత్త
మెళియాపుట్టి, మే 1: గిరిజన ప్రజల నుంచి ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నిరసన సెగ తగులుతున్న నేపథ్యంలో సోమవారం ఆమె సమయం మార్చి అప్పటికప్పుడు షెడ్యూల్లో మార్పు చేసి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. వెంకటాపురం పంచాయతీలో నిర్ణీత సమమంలో మార్పు చేసి పర్యటించారు. బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చేలా వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ.. గతంలో హీరాపురం, చందనగిరి గ్రామాలకు రాకుండా గిరిజన సంఘాల నాయకులు ఎమ్మెల్యేని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శనివారం షెడ్యూల్ ముందుగా ప్రకటించకుండానే చందనగిరి గ్రామం వెళ్లారు. సోమవారం ఉదయం 6 గంటలకే అడ్డివాడ గ్రామంలో పర్యటించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేని అడ్డుకునేలా గిరిజన సంఘాలు సైతం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. గిరిజనులకు భయపడి ఎమ్మెల్యే సమయాలను మార్పు చేసి పర్యటించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని వారు పేర్కొంటున్నారు. ఎప్పుడూ 11 గంటలకు బయటకు వచ్చే ఎమ్మెల్యే సోమవారం ఉదయం 6 గంటలకే గ్రామాల్లోకి రావడంతో ఆ పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.