ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ కేసు
ABN , First Publish Date - 2023-12-12T23:30:34+05:30 IST
ఇళ్ల నిర్మాణానికి రూ.50వేలు డిమాండ్ చేసి, కులం పేరుతో దూషించినందుకు ఇద్దరు వ్యక్తులపై టూటౌన్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 12: ఇళ్ల నిర్మాణానికి రూ.50వేలు డిమాండ్ చేసి, కులం పేరుతో దూషించినందుకు ఇద్దరు వ్యక్తులపై టూటౌన్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. టూటౌన్ సీఐ, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... నగరంలోని శాంతినగర్ కాలనీలో బిడ్డికి విజయశాంతి తన భర్త రాజారావుతో కలిసి నివశిస్తోంది. ఆమె మామ గోపాలంకు 2005లో బీపీఎల్ కింద శాంతినగర్ కాలనీలో ప్రభుత్వం పట్టా మంజూరు చేయడంతో అక్కడ పూరిల్లు నిర్మించుకుని ఉండేవారు. 2020లో ఆ పట్టాను రాజారావు పేరిట మామ గోపాలం, అత్త సరస్వతి మార్పించారు. ఆ స్థలంలో గృహ నిర్మాణ పనులు చేపడుతుండగా నవంబరు 20న ఓ పత్రిక విలేకరి మోకరా వెంకటమల్లేశ్వరరావు వెళ్లి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారని విజయశాంతి పోలీసులకు తెలిపింది. డబ్బులు ఇవ్వకపోవడంతో తమపై మున్సిపల్ కమిషనర్కి తప్పుడు ఫిర్యాదు చేశారని, దీనిపై కోర్టును ఆశ్రయించామని వివరించింది. ఈ నెల 6నతన భర్త ఇంట్లో లేనప్పుడు మల్లేశ్వరరావు, చైతన్య వచ్చి తనను కులం పేరుతో దూషించారని విజయశాంతి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మల్లేశ్వరరావు, చైతన్యలపై మంగళవారం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు టూటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు.