సెలవులపై సతమతం
ABN , First Publish Date - 2023-01-08T00:09:09+05:30 IST
ఉపాధ్యాయుల కోసం రూపొందించిన ముఖ ఆధారిత(ఫేషియల్) యాప్లో సెలవుల పరంగా కొత్త చిక్కు వచ్చింది. ఈ యాప్లో సెలవులు చూపించకపోవడంతో ఉపాధ్యాయులకు అవస్థలు తప్పడం లేదు. అత్యవసర సమయాల్లో విధులకు హాజరుకాలేనివారికి సీఎల్ మంజూరు చేయడం ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు కష్టంగా మారింది.
- కొత్తయాప్లో సాంకేతిక ఇబ్బందులు
- ఉపాధ్యాయుల్లో ఆందోళన
(ఇచ్ఛాపురం)
ఉపాధ్యాయుల కోసం రూపొందించిన ముఖ ఆధారిత(ఫేషియల్) యాప్లో సెలవుల పరంగా కొత్త చిక్కు వచ్చింది. ఈ యాప్లో సెలవులు చూపించకపోవడంతో ఉపాధ్యాయులకు అవస్థలు తప్పడం లేదు. అత్యవసర సమయాల్లో విధులకు హాజరుకాలేనివారికి సీఎల్ మంజూరు చేయడం ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు కష్టంగా మారింది. ఏటా మహిళా ఉపాధ్యాయులకు 27, పురుషులకు 22 సాధారణ సెలవులు కేటాయిస్తారు. వీటిని ఏడాదిలో వినియోగించుకోవాలి. జిల్లావ్యాప్తంగా ముఖ ఆధారిత యాప్తో హాజరు చేసే ఉపాధ్యాయులు 10,441 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరంతా సెలవుల విషయంలో ఆందోళన చెందుతున్నారు. గతంలో ఉపాధ్యాయులు సెలవు కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు మంజూరు చేసేవారు. ప్రస్తుతం ఫేషియల్ యాప్ను ప్రవేశపెట్టి అందులోనే సెలవులకు దరఖాస్తు చేస్తే అధికారులు మంజూరు చేసే విధానం వచ్చింది. ఇందులో 14 రకాల సెలవులను నిక్షిప్తం చేశారు. కొత్త సంవత్సరం రావడంతో యాప్లో అన్ని రకాల సెలవుల వివరాలు అప్డేట్ చేయాలి. ప్రతి ఉపాధ్యాయుడికి సీఎల్లు ఏడాదికి 15 ఉండగా, యాప్లో నిక్షిప్తం కాలేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. సాధారణ సెలవులను జనవరి 1వ తేదీ నుంచే యాప్లో నమోదు చేయాలి. యాప్ పని చేయకపోవడంతో ఉపాధ్యాయులు అత్యవసరంగా సెలవు పెట్టాలంటే ఇబ్బందిగా మారింది. ఆయా పాఠశాలల్లో డీడీవోలే గతేడాది మొదట్లో వీటి వివరాలను యాప్లో నిక్షిప్తం చేశారు. గందరగోళంగా ఉన్న కొత్త ఫేషియల్ యాప్లో ఈ సంవత్సరం తమ లాగిన్లో ఎడిట్ ఆప్షన్ పని చేయకపోవడంతో తాము చేయగలిగిందేమీ లేదని పలువురు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
త్వరలో పరిష్కారం
కొత్త ఏడాదిలో సెలవుల నిక్షిప్తం చేసే అధికారం డీడీవోల లాగిన్లో లేదు. ఐటీ సెల్ సిబ్బంది బైజూస్ హడావుడిలో ఉండడంతో కొత్త ఫేషియల్ యాప్లో సెలవుల నిక్షిప్తం ప్రక్రియ ఆలస్యమైంది. ఉన్నతాధికారుల సమాచారం మేరకు రెండు మూడు రోజుల్లో సాంకేతిక సమస్య పరిష్కారం కానుంది.
- జి.పగడాలమ్మ, డీఈవో, శ్రీకాకుళం