చెల్లింపులకు చట్టబద్ధత కల్పించాలి
ABN , First Publish Date - 2023-03-02T00:17:46+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు చట్టబద్ధత కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం శ్రీకాకుళంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు.
- ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ
శ్రీకాకుళం, మార్చి 1(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు చట్టబద్ధత కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం శ్రీకాకుళంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిలకు, ప్రజాప్రతినిధులకు వేతనాలు చెల్లించేందుకు చట్టాలున్నాయి. అదే మాదిరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతనాలు.. ఇతరత్రా ఆర్థిక ప్రయోజనాలు చెల్లించే విషయంలో చట్టబద్ధత కల్పించడంలో తప్పేముంది?. ఇదేవిషయమై అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగులతో చర్చావేదిక నిర్వహిస్తే.. వారు కూడా మాతో ఏకీభవించారు. అందుకే చట్టబద్ధం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎన్ని ఏళ్లు గడిచినా.. ఇవే సమస్యలుంటాయి. ఉద్యోగుల జీపీఎఫ్, జీఎల్ఐ, జీతభత్యాలు చెల్లింపులు, సరెండర్ లీవ్లు.. ఇతరత్రా అలవెన్స్లు.. డెబిట్ చేసి క్రెడిట్ చేయడం లేదు. ఇవేవీ ప్రభుత్వ అనుగ్రహంతో ఇచ్చేవి కాదు. ప్రతిపక్ష నాయకులను కలిసినా.. వెనక ఎవరో ఉన్నారన్న ప్రచారం చేస్తారన్న కారణంతో గవర్నర్ను కలసి వినతిపత్రం ఇచ్చాం. పాకిస్తాన్ వెళ్లి.. ఎవరినీ కలవలేదని అర్థం చేసుకోవాలి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ఉద్యోగులకు చెల్లింపులకు ఆర్థిక భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని సూర్యనారాయణ కోరారు. జీఎల్ఐ తీసుకోని ఉద్యోగులు.. నెలవారీగా జీతం నుంచే జీపీఎఫ్ ఖాతాలో పొదుపుచేసుకుంటున్నారని తెలిపారు. ఆ సొమ్ముకూ భద్రతగా ఉండాల్సిన ప్రభుత్వమే.. గతేడాదికి సంబంధించి లెక్కలు వెల్లడించలేదన్నారు. ప్రభుత్వం వద్ద సుమారు రూ.13వేల కోట్లు ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఉంటుందని, దానికి లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నారాయణ, రాజేశ్వరి, సంతోష్.. అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.