కాలం చెల్లిన బస్సులు
ABN , First Publish Date - 2023-06-26T00:15:56+05:30 IST
ఈ నెల 6న నరసన్నపేట మండలం కోమర్తి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు(ఏపీ03 జెడ్ 0004) బోల్తా పడింది. స్టీరింగ్ విరిగి ఊడిపోవడంతో బస్సు అదుపు తప్పి ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్, కండక్టర్తో పాటు 17మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. కాలం చెల్లిన బస్సు కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని క్షతగాత్రులు ఆరోపించారు. బస్సుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
(టెక్కలి)
ప్రయాణికులకు కాలం చెల్లిన బస్సులతో ఆర్టీసీ సేవలందిస్తోంది. జిల్లాలో శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2, టెక్కలి, పలాస డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో పల్లెవెలుగు, డీలక్స్, ఆలా్ట్ర, సూపర్లగ్జరీ.. ఇలా వందకుపైగా బస్సులు పాడైపోయాయి. గతంలో ఆర్టీసీ అధికారులు 13 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను కాలం చెల్లినవాటిగా పరిగణించేవారు. ఆర్టీసీ నష్టాలబాట పట్టిన నేపథ్యంలో నేడు సుమారు 17లక్షల కిలోమీటర్లు దాటినా అవే బస్సులను తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డిపోలకు ఆర్టీసీ యాజమాన్యం కొత్తబస్సులు మంజూరు చేయడం లేదు. హయర్ బస్సులను నడిపించడం తప్ప.. కొత్త బస్సుల జోలికి పోవడం లేదు. వాస్తవానికి ఎనిమిది లక్షల కిలోమీటర్లు తిరిగిన ఆర్టీసీ బస్సు విజయనగరం జోనల్ లెవల్ వర్క్షాప్కు వెళ్లి సీవో (కంప్లీట్ ఓవరాల్) చేసుకురావాల్సి ఉన్నా ఆ పరిస్థితులు కూడా తగ్గుముఖం పట్టాయి. డిపోల పరిధిలో గ్యారేజ్ సిబ్బంది ఇంజన్లు బాగుచేయడం, గేరుబాక్సులు మార్చుకోవడం, బాడీలో ప్యాచ్వర్క్లు చేయడం, ఇలా అవసరమున్న యంత్రపరికరాలు తరచూ మారుస్తూ డొక్కు బస్సులను నడిపిస్తున్నారు. జిల్లాలో టెక్కలి డిపో పరిధిలో 55, పలాసలో 74, శ్రీకాకుళం-1 డిపో పరిధిలో 60, శ్రీకాకుళం-2లో 71 వరకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో చాలా బస్సులు కాలం చెల్లినవి కావడంతో తరచూ పాడైపోతున్నాయి. మధ్య మధ్యలో ఆగుతూ.. ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. పాతబస్సులు కావడంతో సకాలంలో గమ్యానికి చేర్చడం లేదు. బస్సుల్లో వైబ్రేషన్ సౌండ్లు ప్రయాణికులకు ఒక్కోసారి విసుగు పుట్టిస్తుంటాయి. పింపురుపట్టిన ఐరన్రాడ్లు మూలంగా ప్రయాణికుల దుస్తులకు మరకలు పడుతున్నాయి. ఇప్పటికైనా కొత్త బస్సులు వేయాలని, సకాలంలో తమను గమ్యానికి చేర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఫ ఈ విషయమై ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్ కుమార్ వద్ద ప్రస్తావించగా ‘గత ఆరు నెలల్లో జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో 36 హయర్ బస్సులు నడుపుతున్నాం. అదనంగా మరో 36 హయర్ బస్సులకు ప్రతిపాదన పంపాం. జిల్లాకు కొత్త ఆర్టీసీ బస్సుల కోసం టెండర్లు ప్రక్రియ నిర్వహించాల్సి ఉంద’ని తెలిపారు.