చెరువు కాదు.. రిజర్వాయరే!
ABN , First Publish Date - 2023-06-26T00:17:02+05:30 IST
పలాస, మెళియాపుట్టి మండలాల్లోని 2వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే వరహాలగెడ్డ రిజర్వాయర్ కళ తప్పుతోంది. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా రిజర్వాయర్ కనీస మరమ్మతులకు నోచుకోని దుస్థితిలో ఉంది.
(పలాస రూరల్)
పలాస, మెళియాపుట్టి మండలాల్లోని 2వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే వరహాలగెడ్డ రిజర్వాయర్ కళ తప్పుతోంది. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా రిజర్వాయర్ కనీస మరమ్మతులకు నోచుకోని దుస్థితిలో ఉంది. సిల్ట్ పేరుకుపోవడం, పిచ్చిమొక్కలు పెరిగి మైదానంలా మారి నీటి నిల్వ సామర్ధ్యం అడుగంటింది. గట్టును పటిష్టం చేసి లోతు చేస్తే మరో వెయ్యి ఎకరాలకు నీరందించవచ్చు. కానీ రిజర్వాయర్ నిర్వహణ సక్రమంగా లేక చెరువు మాదిరిగా తలపిస్తోంది. పలాస, మందస సరిహద్దులో లొత్తూరుకు వెళ్లే రహదారిలో 1978లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.కోటికి పైగా నిధులతో వరహాలగెడ్డ రిజర్వాయరును నిర్మించారు. మహేంద్రతనయ కొండల నుంచి వచ్చే నీటి ని నిల్వ చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. మెళియాపుట్టి, పలాస మండలాల్లో 2వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు రెండువైపులా మదుములు, కుడివైపు భారీ సర్ప్లస్ వియర్(పరుపు) నిర్మించారు. నిర్వహణ లోపంతో కేవలం వర్షాకాలంలో తప్ప మిగిలిన రోజుల్లో కనీసం పశువులు తాగేందుకు నీరు నిల్వ ఉండని దుస్థితి నెలకొంది. కిలోమీటరు పొడవునా రిజర్వాయరు గట్టు నిర్మించినా దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో రెండు మండలాల రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రిజర్వాయర్ను బాగుచేయాలని రైతులు కోరుతున్నారు.
చర్యలు చేపట్టాలి
రిజర్వాయర్ను బాగు చేసి.. అన్ని కాలాల్లో సాగునీరు ఉండేలా చర్యలు చేపట్టాలి. సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి.
ఎస్.త్రినాథ్, లొత్తూరు