జూన్ పోయి.. ఆగస్టూ వచ్చే!
ABN , First Publish Date - 2023-08-02T00:14:07+05:30 IST
సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలు కూడా నెరవేరకపోవడంపై జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 19న మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా.. బహిరంగ సభ వేదికగా సీఎం జగన్ కొన్ని హామీలు ఇచ్చారు.
- ఉద్దానానికి మంచినీరు ఇంకెప్పుడు?
- ఫిషింగ్ హార్బర్ ఏమైనట్లో..?
- పాతపట్నానికి తాగునీటి పథకం విస్తరణ లేదు
అమలుకాని సీఎం వైఎస్ జగన్ హామీలు
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
- జూన్లో ఉద్దానానికి తాగునీరు అందించే పథకాన్ని ప్రారంభిస్తాం.
- ఉద్దానం నీటి పథకాన్ని విస్తరించి.. అదనంగా రూ.265 కోట్లు కేటాయిస్తాం. పాతపట్నం నియోజకవర్గానికీ తాగునీరు అందిస్తాం.
- మంచినీళ్లపేట వద్ద నిర్మిస్తున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు రూ.89 కోట్లు అదనంగా కేటాయిస్తున్నాం. దీనిని ఫిషింగ్ హార్బర్గా మార్పు చేస్తాం.
- సంతబొమ్మాళి మండలంలో ప్రజలకు తాగునీరు అందించేందుకు సీపీడబ్ల్యు స్కీమ్ కింద రూ.70 కోట్లు మంజూరు చేస్తాం.
...ఇవీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లావాసులకు ఇచ్చిన హామీలు. ఏప్రిల్ 19న మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా.. బహిరంగ సభ వేదికగా ఈ హామీలు ప్రకటించారు. కానీ ఇంతవరకూ వీటికి సంబంధించి అతీగతీ లేదు. నిధులు మంజూరు కాక.. పనులు ప్రారంభం కాలేదు. దీంతో జిల్లావాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
............................
సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలు కూడా నెరవేరకపోవడంపై జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 19న మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా.. బహిరంగ సభ వేదికగా సీఎం జగన్ కొన్ని హామీలు ఇచ్చారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి రూ.700కోట్ల వ్యయంతో ఉద్దానానికి మంచినీటిని అందించేందుకు పనులు పూర్తయ్యాయని, జూన్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జూన్తో పాటు జూలై గడిచిపోయింది. ఆగస్టు కూడా వచ్చేసింది. కానీ ఇంతవరకూ ఈ పథకం ప్రారంభించలేదు. ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మంత్రి, అధికారులు ఈ పథకానికి సంబంధించి ట్రయల్ రన్ వేశారు. ప్రస్తుతం పలాస వరకు నీరు సరఫరా అవుతోంది. అక్కడ నుంచి పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో.. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఉద్దానం ప్రజలు నిరాశ చెందుతున్నారు. తాగునీటి పథకం పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని ఎదురుచూస్తున్నారు.
- ప్రతిపాదనల్లోనే విస్తరణ
ఉద్దానం నీటి పథకాన్ని విస్తరించి అదనంగా రూ.265 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. దీనిద్వారా పాతపట్నం నియోజకవర్గానికి తాగునీటిని అందిస్తామని వెల్లడించారు. కానీ ఇందుకు సంబంధించి ప్రకటనలు.. ప్రతిపాదనలే తప్ప.. నిధులు విడుదల కాలేదు. ఇంతవరకు నీటిపథకం విస్తరణ పనులు ప్రారంభం కాకపోవడంతో పాతపట్నం నియోజకవర్గ ప్రజలు నిరాశ చెందుతున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు కూడా కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు.
- ఫిషింగ్ హార్బర్ సాధ్యమేనా?
మంచినీళ్లపేట వద్ద నిర్మిస్తున్న ఫిష్ల్యాండింగ్ సెంటర్కు రూ.89 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఫిష్ల్యాండింగ్ సెంటర్ను ఫిషింగ్ హార్బర్గా మార్పుచేస్తామని చెప్పారు. కానీ ఇందుకు సంబంధించి నిధులు విడుదల కాలేదు. పాత పనులే తప్ప కొత్తగా హార్బర్ కోసం పనులు ఆరంభం కాలేదు. హార్బర్గా మార్పు ఇప్పట్లో సాధ్యమవుతుందా? అని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- విడుదలకాని నిధులు
సంతబొమ్మాళి మండలంలో 49 గ్రామాలకు తాగునీరు అందించేందుకు సీపీడబ్ల్యు స్కీమ్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అడిగారు. ఇందుకోసం తాను రూ.70 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇప్పటికీ ఆ నిధులు విడుదల కాలేదు. టెండర్ దశ కూడా పూర్తికాలేదు. సీఎం జగన్ హామీలు ఇచ్చి.. నెలలు గడుస్తున్నా కనీస కదలిక లేకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు హడావిడి కాకుండా... ముందస్తుగా పనులు చేపడితే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.