ఆ అమ్మానాన్నకు ఎలాచెప్పాలో..?
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:00 AM
ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన ఆ కుమారుడుని అల్లారుముద్దుగా పెంచారు. తమ ఆశలన్నీ ఆ కుమారుడిపై పెట్టుకుని చదివించారు. ఉద్యోగం చేసి.. తమకు అండగా నిలుస్తాడని ఎన్నో కలలు కన్నారు. కానీ విధి వారి ఆశలను అడియాశలు చేసింది.
- విధుల్లో చేరిన నెలరోజులకే కొడుకు మృతి
- ఇరాన్ వద్ద సంద్రంలో బోటు మునిగి ప్రమాదం
- మృతదేహాన్ని రప్పించేందుకు గ్రామస్థుల ప్రయత్నం
కంచిలి, డిసెంబరు 28: ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన ఆ కుమారుడుని అల్లారుముద్దుగా పెంచారు. తమ ఆశలన్నీ ఆ కుమారుడిపై పెట్టుకుని చదివించారు. ఉద్యోగం చేసి.. తమకు అండగా నిలుస్తాడని ఎన్నో కలలు కన్నారు. కానీ విధి వారి ఆశలను అడియాశలు చేసింది. ఉద్యోగంలో చేరిన నెలరోజులకే ఓడ ప్రమాదంలో ఆ కుమారుడి ప్రాణాలను బలిగొంది. దేశం కాని దేశంలో కుమారుడు మృతి చెందాడన్న వార్తను.. వృద్ధాప్య దశలో తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక.. గ్రామస్థులు తల్లడిల్లిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇరాన్ సముద్ర జలాల్లో నాలుగు రోజుల కిందట మర్చంట్ నౌక మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కంచిలి మండలం భోగాబెణి పంచాయతీ జెన్నాఘయి గ్రామానికి చెందిన ఉమ్మిడి సింహాచలం(21) మృతి చెందినట్టు గ్రామస్థులకు సమాచారం అందింది. సింహాచలం తల్లిదండ్రులు ఊర్మిళ, రామయ్య వృద్ధాప్య దశలో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సమయంలో కుమారుడు మృతివార్తను విని తట్టుకోలేరనే ఉద్దేశంతో గ్రామస్థులెవరూ ఈ విషయాన్ని వారికి చెప్పలేదు. సింహాచలానికి తల్లిదండ్రులతో పాటు ముగ్గురు అక్కలు ఉన్నారు. అందులో ఇద్దరికి వివాహమైంది. సింహాచలాన్ని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచి.. చదివించారు. రాజస్తాన్కు చెందిన రుద్రాక్ష కన్సల్టెన్సీ ట్రస్టు ద్వారా మర్చంట్ నేవీలో ఉద్యోగం రావడంతో ఎంతో సంతోషించారు. సుమారు రూ.4లక్షల వరకు అప్పు చేసి.. ఇరాన్ పంపించారు. ఇరాన్ వెళ్లి నెలరోజుల కిందట విధుల్లో చేరగా.. అనుకోకుండా ఓడ మునిగిపోయిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా గ్రామస్థులకు తెలిసింది. కాగా, కంపెనీ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని సింహాచలం అక్కలు చెబుతున్నారు. ఓడ ప్రమాదంలో గాయాలైనట్టు తెలిసిందని పేర్కొంటున్నారు. కాగా.. సింహాచలం మృతదేహాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో స్వగ్రామానికి రప్పించేందుకు గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సింహాచలం కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.