వైభవంగా.. శ్రీముఖలింగేశ్వరుడి కల్యాణం

ABN , First Publish Date - 2023-05-31T23:48:32+05:30 IST

ప్రసిద్ధ శైవక్షేత్రం.. దక్షిణకాశీగా పేరొందిన శ్రీముఖలింగంలో బుధవారం రాత్రి వైభవంగా శ్రీముఖలింగేశ్వరుడి కల్యాణం నిర్వహించారు. జ్యేష్టమాసం శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొలిపారు.

వైభవంగా.. శ్రీముఖలింగేశ్వరుడి కల్యాణం
శ్రీముఖలింగేశ్వరంలో కొట్నం దంచుతున్న మహిళలు

- నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల గ్రామోత్సవం

జలుమూరు, మే 31: ప్రసిద్ధ శైవక్షేత్రం.. దక్షిణకాశీగా పేరొందిన శ్రీముఖలింగంలో బుధవారం రాత్రి వైభవంగా శ్రీముఖలింగేశ్వరుడి కల్యాణం నిర్వహించారు. జ్యేష్టమాసం శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొలిపారు. ఆలయ ధర్మకర్త పర్లాకిమిడి మహారాజు పేరున పూజలు చేశారు. అనంతరం స్వామిని అలంకరించి.. కల్యాణ మహోత్సవానికి సిద్ధం చేశారు. సాయంత్రం శాస్ర్తోక్తంగా పుట్టమన్ను తెచ్చి.. పీనెలు వేసి.. మహిళలు కొట్నం దంచే కార్యక్రమం చేపట్టారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు నూతన వస్త్రాలతో అలంకరించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నందివాహనంపై పార్వతీ పరమేశ్వరులకు గ్రామోత్సవం నిర్వహించారు. పురోహితుడు బంకుపల్లి భూషణశర్మ ఆధ్వర్యంలో అర్చకులు నారాయణమూర్తి, సింహాచలం, శ్రీకృష్ణ, శివ తదితరులు వైభంగా కల్యాణం చేశారు. కార్యక్రమంలో ఈవో ప్రభాకరరావు, దేవాదాయ సిబ్బంది, అర్చకులు, పలువురు భక్తులు పాల్గొని, స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - 2023-05-31T23:48:32+05:30 IST