తాళాలు పగులగొట్టినా.. ఉద్యమం ఆగదు
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:14 AM
‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం. మా న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సింది పోయి.. కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. మేము సమ్మె చేస్తుండగా.. సచివాలయ ఉద్యోగుల ద్వారా కేంద్రాల నిర్వహణకు చర్యలు చేపట్టింది. బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి.. తెరవడం అన్యాయం’ అని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తాళాలు పగులగొట్టినా.. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యమం ఆగదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
- ఐదోరోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
- కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
- మద్దతు తెలిపిన టీడీపీ నేతలు, ప్రజాసంఘాలు
- కొన్నిచోట్ల కేంద్రాలు తెరిచిన సచివాలయ ఉద్యోగులు
(ఇచ్ఛాపురం/అరసవల్లి, డిసెంబరు 16)
‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం. మా న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సింది పోయి.. కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. మేము సమ్మె చేస్తుండగా.. సచివాలయ ఉద్యోగుల ద్వారా కేంద్రాల నిర్వహణకు చర్యలు చేపట్టింది. బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి.. తెరవడం అన్యాయం’ అని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తాళాలు పగులగొట్టినా.. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యమం ఆగదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలో కొన్నిచోట్ల సచివాలయ అధికారులు.. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి.. తలుపులు తెరిచారు. దీనిపై అంగన్వాడీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గపు చర్యగా ఖండించారు. తమ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే.. మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారికి టీడీపీ, జనసేన నేతలు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. న్యాయపోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కొన్నిచోట్ల మాత్రమే..
అంగన్వాడీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బంది ద్వారా కేంద్రాలు తెరవాలని ఆదేశించినా.. చాలాచోట్ల తలుపులు తెరచుకోలేదు. కొన్నిచోట్ల తెరిచినా చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేయలేదు. విద్యాబోధన చేపట్టలేదు. ఆమదాలవలస మండలంలో సచివాలయ ఉద్యోగులు, సూపర్వైజర్ రత్నాంజళి కలిసి మూలసవలాపురం, తురకపేట, పాలవలస, పురుషోత్తపురం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు తెరిచారు. నిర్వహణ మాత్రం చేపట్టలేకపోయారు. అలాగే ఇచ్ఛాపురంలోని 17వ వార్డు లాలాపేట అంగన్వాడీ కేందాన్ని కమిషనర్ ఎన్.రమేష్ ఆధ్వర్యంలో తెరిచారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత దగ్గరుండి సిబ్బందితో తాళాలు పగులగొట్టారు. తాళాలు పగులగొట్టవద్దని ఇంటి యజమానురాలు అడ్డుకున్నారు. మీకు కేంద్రం వాళ్లు అద్దె చెల్లిస్తున్నారని, మీరు అడ్డుపడొద్దని కమిషనర్ చెప్పడంతో ఆమె వెనుదిరిగింది. దీనిని దుర్మార్గపు చర్యగా ఖండిస్తున్నామని అంగన్వాడీ యూనియన్ నాయకులు హైమావతి, సుబ్బలక్ష్మి, విజయలక్ష్మి, కోమలి తెలిపారు. అలాగే కేదారిపురంలో అంగన్వాడీ కేంద్రం తెరిసేందుకు అధికారులు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకోవడంతో విరమించుకున్నారు. ఇలా చాలాచోట్ల అంగన్వాడీ కేంద్రాలు తెరచుకోలేదు. దీనిపై ఇచ్ఛాపురం సీడీపీవో నాగరాణికి వివరణ అడగ్గా.. మండలంలో పలు కేంద్రాలను పరిశీలించి సచివాలయ సిబ్బందితో మాట్లాడమన్నారు. సోమవారం నుంచి తప్పనిసరిగా కేంద్రాలు తెరిచి.. పౌష్టికాహారం అందజేసేలా చర్యలు చేపడతామని తెలిపారు.
అండగా ఉంటాం
అంగన్వాడీల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. అంగన్వాడీలకు అండగా ఉంటామని, సమస్యలపై పోరాడతామని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, ఇచ్ఛాపురం జనసేన ఇన్చార్జి దాసరి భరోసా ఇచ్చారు. శనివారం ఇచ్ఛాపురంలో దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు సీఎం జగన్ మాయమాటలు చెప్పి.. నట్టేట ముంచారని ఆరోపించారు. న్యాయంగా పోరాడుతున్న వారి సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలను తెరిపించడం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం కళ్లు తెరవాలని..
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఐదోరోజుకు చేరుకుంది. శనివారం కూడా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. శ్రీకాకుళంలోని అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు కళ్లకు నల్ల గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.కల్యాణి మాట్లాడుతూ.. ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదు. అందుకే కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. కనీస వేతనాలు, మెనూ చార్జీలు పెంచాలి. అద్దె బకాయిలు చెల్లించాలి. పదవీ విరమణ బెనిఫిట్స్ వర్తింపజేయాలి. ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో 176 అర్బన్ కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బంది పగులగొట్టి స్వాధీనం చేసుకున్నారని, ఇందుకు ఐసీడీఎస్ సూపర్వైజర్లు కూడా సహకరించడం అన్యాయమని వాపోయారు. యజమానులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలను సైతం తెరవడం దారుణమన్నారు. కేంద్రాల్లో విలువైన సామగ్రి, వస్తువులు కనిపించకపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. హామీలు అమలు చేయాలని కోరగా.. ఇటువంటి చర్యలకు పాల్పడడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టి.రాజేశ్వరి, ప్రమీలాదేవి, పాల్గొన్నారు.