అంతా వారిష్టం

ABN , First Publish Date - 2023-07-08T23:29:35+05:30 IST

అది ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో చెక్‌పోస్టు. అక్కడ ఇదివరకు అక్రమాలు భారీగా జరిగేవి. జీఎస్టీ తర్వాత తీసుకున్న నిర్ణయాల వల్ల అవినీతి కట్టడైందని అందరూ భావించారు. కానీ ఆ చెక్‌పోస్టులో అదే అవినీతి సాగుతోందని ఏసీబీ తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది.

అంతా వారిష్టం
చెక్‌పోస్టులో తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు

- ఆర్టీఏ చెక్‌పోస్టులో ఆగని అవినీతి

- లారీ డ్రైవర్ల నుంచి భారీగా వసూలు

- వేకువజామునే అనధికారికంగా రూ.2.21 లక్షలు

- ఏసీబీ ఆకస్మిక తనిఖీతో బట్టబయలు

- ఎంవీఐ, ఇద్దరు ఏఎంవీఐలు అదుపులోకి..

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం/ఇచ్ఛాపురం)

అది ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో చెక్‌పోస్టు. అక్కడ ఇదివరకు అక్రమాలు భారీగా జరిగేవి. జీఎస్టీ తర్వాత తీసుకున్న నిర్ణయాల వల్ల అవినీతి కట్టడైందని అందరూ భావించారు. కానీ ఆ చెక్‌పోస్టులో అదే అవినీతి సాగుతోందని ఏసీబీ తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది. వేకువజామునే వారి వద్ద అనధికారికంగా సుమారు రూ.2.21 లక్షలు ఉన్నట్టు తనిఖీలో బయటపడింది. ఇచ్ఛాపురం మండలం పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు వద్ద ఒడిశా నుంచి వచ్చే భారీ వాహనాల తనిఖీలు జరుగుతుంటాయి. ఇక్కడ లారీ డ్రైవర్ల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేరింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల వద్ద తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం వేకువజామున ఏసీబీ అధికారులు పురుషోత్తపురం ఆర్టీఏ చెక్‌పోస్టులో తనిఖీలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించి రూ.5లక్షలు ఉండగా.. అనధికారికంగా రూ. 2.21 లక్షల నగదు సిబ్బంది వద్ద ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒక మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నెలకు రూ.కోట్లలో అక్రమార్జన

శనివారం వేకువజామునే చెక్‌పోస్టులో సిబ్బంది వద్ద రూ.2.21 లక్షలు అక్రమ సొమ్ము పట్టుబడడం చర్చనీయాంశమవుతోంది. ఈ లెక్కన ఒక నెలకు రూ.కోట్లలో అక్రమ రాబడి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. లారీ డ్రైవర్ల నుంచి నిర్దేశిత మొత్తం కాకుండా.. భారీగా వసూలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా ఏసీబీ తనిఖీలతో అవినీతి వ్యవహారం బయటపడడంతో లారీ డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్‌ కోసం సిఫారసులతో అధికారులు వస్తున్నారని.. అక్రమ సంపాదనతో రూ.కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపిస్తున్నారు. చెక్‌పోస్టు వద్ద నిరంతరం నిఘా ఏర్పాటుచేస్తేనే అవినీతికి అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

అర్ధరాత్రి.. ఆకస్మికంగా తనిఖీలు

పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఏసీబీ దాడులు సాగాయి. మూడు వాహనాలపై ఆకస్మికంగా వచ్చి ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘చెక్‌పోస్టులో ఉన్న ఆర్టీవో కార్యాలయంలో అవినీతి జరుగుతున్నట్లు శ్రీకాకుళం ఏసీబీ కార్యాలయానికి సమాచారం అందింది. సీఐలు భాస్కర్‌రావు, హరి, ఎస్‌ఐలు చిన్నంనాయుడు, సత్యారావుతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశాం. విధుల్లో ఉన్న ఉన్న ఎంవీఐ గోపి కృష్ణ, ఏఎంవీఐలు ఉషా, అప్పన్న వద్ద రూ.23,800 నగదు అదనంగా ఉన్నట్లు గుర్తించాం. బీరువాలో మరో రూ.1.97 లక్షలు పట్టుబడింది. మొత్తం రూ.2,20,800 స్వాధీనం చేసుకున్నాం. ఈ నగదును వాహనాల నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు తేలింది. దాడులకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామ’ని తెలిపారు.

Updated Date - 2023-07-08T23:29:35+05:30 IST