కిడ్నీ వ్యాధితో మరో యువకుడి మృతి
ABN , First Publish Date - 2023-08-02T00:11:52+05:30 IST
ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరో యువకుడు మృతి చెందాడు. వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు గ్రామానికి చెందిన సండుపల్లి సంతోష్(33) సోమవారం ఉదయం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆందోళనలో ఉద్దానం వాసులు
వజ్రపుకొత్తూరు, ఆగస్టు 1 : ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరో యువకుడు మృతి చెందాడు. వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు గ్రామానికి చెందిన సండుపల్లి సంతోష్(33) సోమవారం ఉదయం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్ర గ్రామానికి చెందిన అర్లి రమేష్ (36) కిడ్నీవ్యాధితో మృతిచెందాడు. రమేష్ ఆరు నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిరోజులుగా విశాఖపట్నంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. పరిస్థితి విషమించి మృతి చెందాడని వివరించారు. రమేష్ తల్లిదండ్రులు దానేష్, మీనాక్షి రెండేళ్ల కిందట మృతిచెందారు. దీంతో రమేష్ తన అన్నయ్యల వద్ద ఉంటున్నాడు. రమేష్ మృతితో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ఒకే రోజు గంటల వ్యవధిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇద్దరు యువకులు మృతిచెందడంతో ఉద్దానం వాసులు భయాందోళన చెందుతున్నారు. మార్చిలో వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి గ్రామానికి చెందిన దుమ్ము కుసుమ (19) కూడా కిడ్నీవ్యాధిలో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయింది. గతంలో 50 ఏళ్లు దాటినివారు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారని.. ప్రస్తుతం యువకులు కూడా ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరమని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. కిడ్నీవ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కోరుతున్నారు.