కొట్లాటలో ఇరువర్గాలపై కేసు నమోదు
ABN , First Publish Date - 2023-10-02T00:07:49+05:30 IST
నగరంలోని ఓ చర్చిలో పాస్టర్ను మార్చాలన్న విషయంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో ఇరువర్గాల ఫిర్యాదుపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
శ్రీకాకుళం క్రైం: నగరంలోని ఓ చర్చిలో పాస్టర్ను మార్చాలన్న విషయంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో ఇరువర్గాల ఫిర్యాదుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పేందుకు మదనాపురానికి చెందిన వేమగిరి రమణ తన కుమారుడు ధర్మరాజుతో కలిసి ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో వచ్చారు. ఇదే సమయంలో డీబీబీ కుమార్, అతని కుమార్తె బృందా, పాస్టర్ జాకబ్, సతీష్రత్న అక్కడికి చేరుకుని వేమగిరి రమణ వాక్యం చెప్పనీయకుండా అడ్డుకున్నారు. దీంతో జాకబ్ అనుచరుల, రమణ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ధర్మరాజు, హేమలత, సునీల్, రవీంద్రపై కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో ధర్మరాజు గాయపడ్డాడు. ఇతడికి రిమ్స్లో చికిత్స అందించారు. అలాగే జాకబ్ అనుచరులు మాతా థెరిసా, జయలతతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. వీరు కూడా రిమ్స్లో చికిత్స తీసుకున్నారు. ఇరు వర్గాలు రిమ్స్ ఔట్పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై టూటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు.