ఒకేరోజు రూ.100కోట్ల వ్యాపారం!
ABN , First Publish Date - 2023-03-22T23:58:03+05:30 IST
ఉగాది పర్వదినాన వ్యాపారాలు జోరుగా సాగాయి. ఉగాది రోజు కొత్త వస్తువు కొనుగోలు చేస్తే శుభపరిణామమని చాలా మందికి సెంటిమెంట్. ఈ నేపథ్యంలో బుధవారం బంగారం దుకాణాలు, సెల్పాయింట్లు, ఎలక్ర్టానిక్, గృహాపకరణాలు, వస్త్ర దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి.
- వ్యాపారులకు కలిసొచ్చిన ఉగాది సెంటిమెంట్
- వినియోగదారులతో కిటకిటలాడిన వ్యాపార సముదాయాలు
నరసన్నపేట/టెక్కలి/టెక్కలి రూరల్, మార్చి 22: ఉగాది పర్వదినాన వ్యాపారాలు జోరుగా సాగాయి. ఉగాది రోజు కొత్త వస్తువు కొనుగోలు చేస్తే శుభపరిణామమని చాలా మందికి సెంటిమెంట్. ఈ నేపథ్యంలో బుధవారం బంగారం దుకాణాలు, సెల్పాయింట్లు, ఎలక్ర్టానిక్, గృహాపకరణాలు, వస్త్ర దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. బుధవారం ఒక్కరోజే జిల్లాలో రూ.100కోట్లకుపైగా వ్యాపారాలు సాగాయని రాష్ట్ర జీఎస్టీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువమంది వినియోగదారులు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేశారు. నరసన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం, పలాస, సోంపేట, పాతపట్నం ప్రాంతాల్లో బంగారం విక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. శ్రీకాకుళం, నరసన్నపేట తదితర ప్రాంతాల్లో వ్యాపారులు ఆఫర్లు ప్రకటించారు. బంగారం ఆభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు వెండి నాణెం ఉగాది కానుకగా ఇచ్చారు. మరికొందరు వ్యాపారులు బంగారు ఆభరణాలపై తరుగు శాతం తగ్గించారు. అలాగే ఫ్రిజ్లు, ఏసీలు, కూలర్లు, టీవీలు తదితర గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసినవారికి లక్కీ కూపన్లు అందజేశారు. వస్త్ర దుకాణాల్లో కూడా డిస్కౌంట్లు ప్రకటించడంతో.. వినియోగదారులు భారీగా కొనుగోలు చేశారు.