AP News: విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు కారు ప్రమాద ఘటనలో పురోగతి
ABN , First Publish Date - 2023-06-11T15:10:39+05:30 IST
విజయవాడ బీఆర్టీఎస్ (BRTS) రోడ్డు కారు ప్రమాద ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ జమీర్ బాషాను అరెస్ట్ చేశారు.
విజయవాడ: విజయవాడ బీఆర్టీఎస్ (BRTS) రోడ్డు కారు ప్రమాద ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ జమీర్ బాషాను అరెస్ట్ చేశారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ భాస్కరరావు (ACP Bhaskara Rao) తెలిపారు. కారు జమీర్ బాషా చెల్లి పేరుతో ఉందన్నారు. రామవరప్పాడు నుంచి సింగ్నగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, కారులో నజీర్బాషా ఒక్కడే ఉన్నాడని ఏసీపీ పేర్కొన్నారు. కారులో మద్యం సీసాలు ఉన్నాయన్నది అవాస్తవమని తెలిపారు. కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ లేదని వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని భాస్కరరావు ప్రకటించారు.
బీఆర్టీఎస్ రోడ్లో శనివారం అర్థరాత్రి 2:30 గంటలకు ర్యాపిడో బైక్ (Rapido Bike)ను జమీర్ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో లక్ష్మణ్ అనే యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో జమీర్ కారును వదిలి పరారయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు అద్దానికి ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ తొలగించారు. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కారును గుణదల పోలీస్ స్టేషన్కు తరలించి... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.