ఆర్టీసీ డ్రైవర్పై వైసీపీ నేతల దాడి దుర్మార్గం
ABN , First Publish Date - 2023-10-30T00:03:30+05:30 IST
విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్పై వైసీపీ నాయకులు దాడి దారుణమని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నాగేశ్వరరావు అన్నారు. హారన్ కొట్టినందుకే భౌతికదాడులకు పాల్పడటం జగన్ దౌర్జన్యపాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. శనివారం కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్పై దాడిని నిరసిస్తూ జిల్లాలో ఈయూ ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులు ఆందోళనలు చేపట్టారు.
ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు
డిపోల వద్ద కార్మికుల ధర్నా
నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు
ఒంగోలు (కార్పొరేషన్), అక్టోబరు 29 : విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్పై వైసీపీ నాయకులు దాడి దారుణమని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నాగేశ్వరరావు అన్నారు. హారన్ కొట్టినందుకే భౌతికదాడులకు పాల్పడటం జగన్ దౌర్జన్యపాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. శనివారం కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్పై దాడిని నిరసిస్తూ జిల్లాలో ఈయూ ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ఒంగోలు, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం ఆర్టీసీ డిపోల వద్ద ఽనల్లబ్యాడ్జీలు ధరించి ధర్నాలు నిర్వహించారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావు మాట్లాడారు. ఆర్టీసీ బస్సుడ్రైవర్ కారు తొలగించాలని హారన్ కొట్టినందుకు వైసీపీ నేతలు రౌడీయిజం చేసి, నడిరోడ్డుపై కాలుతో తన్నడం దుర్మార్గమన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జోనల్ ప్రెసిడెంట్ వాకా రమేష్ మాట్లాడుతూ బస్సుల్లో స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వాలని, టికెట్ లేని ప్రయాణం నేరం అని రాసిన విధంగా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయబడును అని సెక్షన్లతో సహా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డ్రైవర్పై దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈయు జోనల్ జాయింట్ సెక్రటరీ బెజవాడ రవి, జిల్లా అధ్యక్షుడు పోలయ్య, కార్యదర్శి పి.వెంకటేశ్వరరెడ్డి, డిపో కార్యదర్శి జి.మాధవరావు, గ్యారేజీ కార్యదర్శి ప్రసాదరావు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దాడిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.